టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలకు దారి తీస్తున్న థియేటర్ల బంద్ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ తరఫున నిర్మాతల మండలికి లేఖ వెళ్లడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. మే 18 ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ విదాహాన్ని డిమాండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాని గురించి జూన్ 1లోగా నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో థియేటర్లను మూసివేయాలనే ఉద్దేశాన్ని అందులో పేర్కొంటూ, వీలైనంత త్వరగా సమాధానం ఇవ్వాలని లెటర్లో కోరారు. ఒకవేళ ఏదీ తేలకపోతే మాత్రం సింగల్ స్క్రీన్ల తలుపులు మూసుకునేలా ఉన్నాయి.
ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. దీని గురించి విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు పర్సెంటేజ్ పట్ల సానుకూలంగానే ఉన్నారని, కాకపోతే క్యాంటీన్, పార్కింగ్ లాంటి ఇతరత్రా ఆదాయాల్లో కూడా నిర్మాతలకు వాటా ఇచ్చే పక్షంలో ఒప్పుకుంటామని అంటున్నారట. ఇంకొందరు అద్దె విధానంలో అయితేనే కిట్టుబాటు అవుతుందని, షేరింగ్ వెళ్తే నష్టాలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇప్పుడీ విషయంలో ఏకాభిప్రాయం రావడం అంత సులభంగా కనిపించడం లేదు. సీనియర్ ప్రొడ్యూసర్లు, కొత్త తరం నిర్మాతల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతను ఎవరు తీసుకుంటారో మరి.
పరిష్కారం దొరికితే సరే. ఏ టెన్షన్ ఉండదు. అలా కాకుండా థియేటర్ల బంద్ అనివార్యమైతే ముందు ప్రభావితం చెందేది భైరవం. మే 30 రిలీజవుతున్న సినిమా ఇదే. తర్వాత జూన్ 5 దగ్ లైఫ్ ఉంది. మల్టీప్లెక్సుల్లోనే వీటి విడుదల చాలనుకుంటే ప్రొసీడ్ అవొచ్చు. కానీ బిసి సెంటర్లలో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లే ఉన్న నేపథ్యంలో సొల్యూషన్ లేకుండా గుడ్డిగా వెళ్లేందుకు ఆయా నిర్మాతలు ఇష్టపడకపోవచ్చు. రాబోయే వారం రోజుల పరిణామాలు చాలా కీలకం కాబోతున్నాయి. బంద్ జరగకూడదనే ప్రతి ఒక్కరి ఆకాంక్ష. కానీ ఎగ్జిబిటర్లు ఈసారి పట్టుదలగా ఉన్నారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.