ఇంకో పది రోజుల్లో విడుదల కాబోతున్న భైరవం ప్రమోషన్లు ఊపందుకున్నాయి. ఛత్రపతి రీమేక్ కోసం చాలా గ్యాప్ తీసుకున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్ దీని మీద చాలా నమ్మకంతో ఉన్నాడు. తమిళ గరుడన్ రీమేక్ అయినప్పటికీ కేవలం సోల్ మాత్రమే తీసుకుని ఒరిజినల్ వర్షన్ కన్నా ఇదే అద్భుతంగా ఉందనే రీతిలో దర్శకుడు విజయ్ కనకమేడల గొప్పగా తీర్చిదిద్దారని కితాబిచ్చాడు. మా ప్రతినిధికిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ కాంతారని మించిన బాబులాంటి వైబ్ భైరవంలో పొందుతారని, చిన్నా పెద్ద తేడా లేకుండా బెస్ట్ థియేటర్ ఎక్స్ పీరియన్స్ అవుతుందని హామీ ఇచ్చాడు.
ఫస్ట్ ఫ్రేమ్ నుంచి శుభం కార్డు దాకా ప్రతి ఒక్క సీన్, ఎపిసోడ్ ని ఫ్రెష్ గా రాసుకున్నామని చెబుతున్న సాయిశ్రీనివాస్ గతంలో రీమేకులు చేసినప్పుడు కలిగిన పొరపాట్లనుం ఈసారి రిపీట్ చేయనివ్వలేదని అన్నాడు. అంతేకాదు నారా రోహిత్, మంచు మనోజ్ తో స్క్రీన్ పంచుకున్న అనుభూతుల గురించి చెప్పుకొచ్చాడు. తొలుత హరిహర వీరమల్లు కోసం లాక్ చేసుకున్న మే 30 డేట్ భైరవంకు దక్కడంతో ఓపెనింగ్స్ పరంగా బాగా హెల్పవుతుందనే ధీమా టీమ్ లో కనిపిస్తోంది. అందులోనూ గత నాలుగైదు వారాలుగా చెప్పుకోదగ్గ కమర్షియల్ మూవీ లేకపోవడంతో బాక్సాఫీస్ కొంచెం డల్లుగానే ఉంది.
జూన్ 1 నుంచి థియేటర్ల బందు ఉంటుందనే వార్తల నేపథ్యంలో ఆ లోగా సమస్య పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో భైరవం టీమ్ ప్రమోషన్లు ఆపడం లేదు. జూన్ 12 పవన్ కళ్యాణ్ వచ్చేదాకా ఏర్పడే గ్యాప్ ని వాడుకునే ఉద్దేశంతో భైరవం ఈ తేదీ మిస్ కాకూడదనే ఉద్దేశంతో ఉంది. నాంది పేరు తెచ్చినా ఉగ్రం నిరాశపరచడంతో దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమా మీద బాగా కసిగా పని చేశారు. ఇటీవలే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంచు మనోజ్ మాటలు బజ్ పెంచడంలో తోడ్పడ్డాయి. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ భైరవం తర్వాత ఏడాది గ్యాప్ లోనే మరో రెండు సినిమాలతో పలకరించేలా ఉన్నాడు.