యుద్ధం వద్దంటున్న తెలుగు హీరోయిన్

కొందరు సెలబ్రిటీలు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ ఒక్కోసారి చిన్న ట్వీట్లు, స్టేటస్ లే పెద్ద రాద్ధాంతానికి దారి తీస్తాయి. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్లో భాగం పంచుకుని తెలుగులో మార్కెట్ పెంచుకున్న ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం ఇదే కోవలోకి వస్తోంది. సరిహద్దుల్లో శత్రుదేశం కవ్వింపులతో సైన్యం ఎంత వీరోచితంగా పోరాడుతోందో చూస్తున్నాం. భారతీయులైన ప్రతి ఒక్కరు పాకిస్థాన్ పీచమణచాల్సిందే అనే నినాదంతో ఆర్మీకి పూర్తి మద్దతు ఇస్తున్నారు. పెహల్గామ్ దుర్ఘటనకు ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం చూశాక ఎవరైనా సరే పాక్ మీద తెగబడటం కరెక్టనే అంటారు.

కానీ ఐశ్వర్య రాజేష్ వెర్షన్ వేరుగా ఉంది. ఇన్స్ టాలో ఒక సుదీర్ఘమైన మెసేజ్ పంచుకుంది. ముందు ఏమందో చూద్దాం. “యుద్ధం వద్దు. ఒక ప్రజాస్వామ్య పౌరురాలిగా ఇండియా, పాకిస్థాన్ ప్రభుత్వాలను ఒకటే కోరుతున్నాను. సంఘర్షణల కన్నా శాంతిని కోరుకుని ఆ దిశగా అడుగులు వేద్దాం. జాతీయతతో సంబంధం లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడం కోసం కలిసి నడుద్దాం. ప్రతిభ కలిగిన వ్యక్తులు, సైనికులు, ప్రజలు ప్రాణాలు కోల్పోకూడదు. యుద్ధాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు అవసరమో ఆ దిశగా అడుగులు వేద్దాం. అందరికి ఈ సందేశం చేరవేద్దాం”. ఇదండీ సదరు హీరోయిన్ పెట్టిన జ్ఞానగుళిక.

ఇది చదివిన నెటిజెన్లు భగ్గుమంటున్నారు. ఇండియా కావాలనే కయ్యానికి కాలు దువ్వుతుందనే రీతిలో ఆమె మాటల్లో అర్థం ధ్వనిస్తోందని, నీతులు పాకిస్థాన్ కు చెప్పకుండా రెండు దేశాలు చర్చించుకోవాలని చెప్పడం చూస్తే బోర్డర్ లో జరిగిన దారుణాలు, పాక్ ఆపకుండా చేస్తున్న కుట్రలు ఐశ్యర్య రాజేష్ కు బహుశా తెలిసినట్టు లేవని విరుచుకుపడుతున్నారు. తప్పు పాక్ చేస్తే మనకు కలిపి హితబోధ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా భారతదేశ సహనాన్ని దశాబ్దాలుగా పరీక్షిస్తున్న పాకిస్థాన్ కు ఇంతకన్నా ఎలా బుద్ది చెప్పాలో ఆమె వివరిస్తే బాగుంటుందని అభిమానులే చురకలు వేస్తున్నారు.