టాలీవుడ్లో ఒకప్పుడు మాంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుల్లో వైవీఎస్ చౌదరి ఒకరు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు చిత్రాలతో ఒక దశలో ఆయన ఊపుమీదున్నారు. కానీ ‘ఒక్క మగాడు’ తర్వాత ఆయన కెరీర్ తిరగబడింది. దాంతో మొదలుకుని వరుసగా డిజాస్టర్లు ఇచ్చి అడ్రస్ లేకుండా పోయారు. ‘రేయ్’ తర్వాత చాలా ఏళ్ల పాటు చౌదరి కనిపించలేదు. ఇక మళ్లీ ఆయన ఓ సినిమా చేయడం కష్టమే అనుకున్నారంతా. కానీ గత ఏడాది నందమూరి జానకిరామ్ తనయుడు కొత్త ఎన్టీఆర్ను హీరోగా పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. రెండు మూడు నెలల పాటు ఈ సినిమా గురించి వరుసగా అప్డేట్స్ ఇస్తూ బాగానే హంగామా చేశారు చౌదరి.
హీరోగా పరిచయమవుతున్న ఎన్టీఆర్, హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న వీణారావులకు సంబంధించి ఇంట్రో వీడియోలు ఆకట్టుకున్నాయి. కీరవాణి, చంద్రబోస్, సాయిమాధవ్ బుర్రా లాంటి టాప్ టెక్నీషియన్లను ఈ సినిమాకు ఎంచుకున్నారాయన. ఐతే ఇలా వరుసగా అప్డేట్స్ ఇస్తూ తన రీఎంట్రీ మూవీని వార్తల్లో నిలబెట్టిన చౌదరి.. ఆ తర్వాత ఉన్నట్లుండి సైలెంట్ అయిపోయారు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేదు. షూటింగ్, రిలీజ్ గురించి అప్డేట్స్ లేవు. సైలెంటుగా షూటింగ్ చేస్తున్నారా అన్న దానిపైనా స్పష్టత లేదు.
దీంతో సినిమా ముందుకు కదులుతుందా.. ఆగిపోతుందా అన్న సందేహాలు కలిగాయి. ఐతే ఎట్టకేలకు చౌదరి కొత్త అప్డేట్తో రెడీ అయ్యారు. మే 12న ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇందుకోసం ఒక విశిష్ఠ అతిథిని తీసుకొస్తున్నారు. సినిమా గురించి అందరూ మాట్లాడుకునేలా చాలా ఘనంగా ముహూర్త వేడుకను నిర్వహించబోతున్నారట. ఆ రోజే సినిమాలో హీరో హీరోయిన్ల లుక్స్ ఎలా ఉండబోతున్నాయో కూడా చూపించబోెతున్నారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను రిలీజ్ చేసేలా షూట్ ప్లాన్ చేస్తున్నారట చౌదరి.