హిట్ 3 విలన్ వెనుక ఊహించని విషాదం

గత వారం విడుదలైన హిట్ 3 ది థర్డ్ కేస్ లో విలన్ గా నటించిన ప్రతీక్ బబ్బర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. అమాయకులను ప్రేరేపించి వాళ్ళతో హత్యలు చేయించి తన స్థావరంలో ప్రమాదకరమైన ఆటలు ఆడించే సైకో కిల్లర్ గా తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఇతని నేపథ్యం గురించి మన ప్రేక్షకులకు అవగాహన తక్కువ. అదేంటో చూద్దాం. ప్రతీక్ బబ్బర్ తల్లి స్మితా పాటిల్. 80 దశకంలో బాలీవుడ్ ని ఊపేసిన హీరోయిన్లలో ఈమె ఒకరు. గ్లామర్ తో కాకుండా పెర్ఫార్మన్స్ తో పేరు తెచ్చుకున్నారు. 1986లో రిలీజైన మిర్చి మసాలాలో నటనకు గాను ఫోర్బ్స్ పత్రిక టాప్ 25 లిస్టులో చోటు ఇచ్చింది.

అమితాబ్ బచ్చన్ శక్తి, ఓంపూరి అర్ద్ సత్యతో స్మిత నేషన్ వైడ్ సెన్సేషన్ అయ్యారు. ప్రముఖ నటుడు, హీరో రాజ్ బబ్బర్ ని పెళ్లి చేసుకున్నాక పుట్టిన సంతానమే ప్రతీక్ బబ్బర్. తర్వాత రెండు వారాలకే స్మిత అనారోగ్యంతో కన్నుమూశారు. అతి చిన్న వయసులో పద్మశ్రీ, రెండు జాతీయ అవార్డులు అందుకున్న ఘనత స్మిత పాటిల్ కు దక్కింది. ఆమెకు గౌరవ సూచకంగా భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. ప్రతీక్ బబ్బర్ కు ఊహ తెలియక ముందే స్మిత పాటిల్ 31 సంవత్సరాలకు 1986లో కన్ను మూయడం విషాదం. అందుకే తల్లి పేరుని తన పేరుతో కలిపి ఉంచమని ప్రతీక్ తన నిర్మాతలకు చెబుతూ ఉంటాడు.

రాజ్, స్మితలకు ప్రతీక్ బబ్బర్ ఒక్కడే సంతానం. బాలీవుడ్ సినిమాల్లో విలన్ గా కనిపిస్తూ ఉంటాడు. సల్మాన్ ఖాన్ సికందర్ లోనూ ఉన్నాడు. 2008 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూన్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ లో చేశాడు కానీ ఆశించినంత గుర్తింపు రాలేదు. హిట్ 3 ప్రతినాయకుడిగా ఒక కొత్త మొహం కోసం వెతుకుతున్న టైంలో దర్శకుడు శైలేష్ కొలనుకు ప్రతీక్ బబ్బర్ కనిపించాడు. ఇతనైతే న్యాయం చేయగలడని భావించి వెంటనే ఎంపిక చేసుకున్నాడు. సెకండాఫ్ కే పరిమితమైనప్పటికీ తన ఉనికిని చాటుకున్నాడు. హిట్ 3 తనకు మరిన్ని అవకాశాలు తీసుకొస్తుందని ప్రతీక్ బబ్బర్ ఎదురు చూస్తున్నాడు.