గుడ్ న్యూస్ : వీరమల్లు రాకకు దారి దొరికింది

ఎదురు చూసి చూసి అభిమానులే అంచనాలు తగ్గించేసుకున్న హరిహర వీరమల్లు గేరు మార్చబోతోందని తాజా సమాచారం. ఈ రోజు నుంచి జరగబోయే షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన బ్యాలన్స్ పార్ట్ పూర్తి చేయబోతున్నట్టు తెలిసింది. ఈ నెల 7 లేదా 8 తేదీల వరకు జరిగే ఈ చిత్రీకరణని దర్శకుడు జ్యోతి కృష్ణ పక్కాగా ప్లాన్ చేసుకున్నారట. ఈ నెలాఖరు విడుదలకు ఉన్న సాధ్యాసాధ్యాలు గురించి నిర్మాత ఏఎం రత్నం తీవ్ర చర్చల్లో ఉన్నారట. విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మే 30 లాక్ చేసుకున్న నేపథ్యంలో ఏ నిర్ణయమైనా వీలైనంత వేగంగా తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు తలెత్తుతాయి.

ఉన్న పాతిక రోజుల్లో డబ్బింగ్, ప్రమోషన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్, మీడియా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, అవుట్ డోర్ పబ్లిసిటీ, డిస్ట్రిబ్యూటర్లతో బిజినెస్ డీల్స్ ఇవన్నీ చక్కదిద్దటం అంత సులభం కాదు. పైగా బజ్ కాస్త తగ్గిపోయిన నేపధ్యంలో ముందు అనుకున్న రేట్లను బయ్యర్లు ఆఫర్ చేయడం లేదట. సో హైప్ పెరగాలంటే ట్రైలర్ రూపంలో ఏదైనా మేజిక్ జరగాలి. అలాని హడావిడిగా కట్ చేయకూడదు. విజువల్స్ తోనే అంచనాలు పెరిగిపోవాలి. అసలే కీరవాణి పాటలు ఆశించిన స్థాయిలో అద్భుతం చేయలేదనే అసంతృప్తి కొంత ఫ్యాన్స్ లో ఉంది. ఇది తగ్గాలన్నా పబ్లిసిటీ ఓ రేంజ్లో జరగాలి. యూనిట్ ఇదే ప్లానింగ్ లో ఉంది.

ఒకవేళ ఎందుకింత అక్కర్లేని ఒత్తిడి అనుకుంటే జూన్ ఇంకో ఆప్షన్ అవుతుంది. వరసగా మూడు నాలుగు వారాల్లో కుబేర, కన్నప్ప ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టూ వీక్స్ తప్ప వీరమల్లుకి వేరే మార్గం లేదు. నాలుగేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ విజువల్ గ్రాండియర్ కు ఇప్పటికైనా మోక్షం దక్కడం ఆనందించాల్సిన విషయమే. బయట సంగతి ఎలా ఉన్నా సినిమా మాత్రం చాలా బాగా వచ్చిందని, పవన్ కళ్యాణ్ ని ఎప్పుడూ చూడని పవర్ ఫుల్ క్యారెక్టర్ లో చూసి ప్రేక్షకులు షాకవుతారని అంతర్గతంగా వినిపిస్తోంది. ఇప్పుడీ పార్ట్ 1 సక్సెస్ మీద పార్ట్ 2 బిజినెస్ ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాల్సిందే.