మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్?

టాలీవుడ్లో ఒక సెలబ్రెటీ జంట తల్లిదండ్రులు కాబోతున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. చాలామంది ఆ జంట అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ్లనే అంటూ వారి ఫొటోలు పెట్టి శుభాకాంక్షలు చెప్పడం మొదలుపెట్టారు. పెళ్లయిన కొన్ని నెలలకే గుడ్ న్యూస్ చెప్పేశారే అంటూ ఆశ్చర్యపోతున్నారు. కానీ చైతూ-శోభిత తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త వాస్తవం కాదన్నది లేటెస్ట్ న్యూస్. ఈ శుభ వార్త మెగా ఫ్యామిలీకి సంబంధించినది అట. రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు తమ కుటుంబంలోకి కొత్త మెంబర్‌ను ఆహ్వానించడానికి సిద్ధమైందట.

లావణ్య ప్రెగ్నెంట్ అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే అఫీషియల్ న్యూస్ బయటికి రావచ్చు. 2017లో వచ్చిన ‘మిస్టర్’ చిత్రంలో కలిసి పని చేసిన సమయంలో వరుణ్, లావణ్యల మధ్య స్నేహం మొదలై అది తర్వాత ప్రేమకు దారి తీసింది. ఈ జంట ‘అంతరిక్షం’ చిత్రంలోనూ కలిసి నటించింది. అప్పుడే ప్రేమ బలపడింది.

2023లో ఈ జంట పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత లావణ్య సినిమాలకు దాదాపు దూరమైనట్లే కనిపించింది. ఐతే మూడు నెలల కిందటే ఆమె ప్రధాన పాత్రలో ‘సతీ లీలావతి’ అనే సినిమా మొదలైంది. తమిళంలో ఆమె ‘తనల్’ అనే సినిమాను పూర్తి చేసేసింది. ‘సతీ లీలావతి’ సినిమా చేతిలో ఉండగానే.. లావణ్య ప్రెగ్నెంట్ అనే వార్త బయటికి వచ్చింది. బహుశా ఆ సినిమా చిత్రీకరణ పూర్తి కావస్తుండొచ్చు. షూట్ అంతా అవ్వగానే లావణ్య విశ్రాంతి తీసుకుంటుందేమో. మరోవైపు వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘కొరియన్ కనకరాజు’ అనే హార్రర్ కామెడీలో నటిస్తున్నాడు. వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్న వరుణ్‌కు తండ్రి అయ్యాక జాతకం మారుతుందేమో చూడాలి.