క‌శ్మీర్‌లో ప్ర‌ముఖ న‌టుడి విహారం

క‌శ్మీర్ వారం ముందు వ‌ర‌కు ప‌ర్యాట‌కుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుండేది. కొన్నేళ్లుగా ఉగ్ర దాడులు త‌గ్గ‌డం, ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొన‌డం, అభివృద్ధి జ‌ర‌గ‌డంతో క‌శ్మీర్‌కు ప‌ర్యాట‌కుల తాకిడి బాగా పెరిగింది. ప్ర‌పంచంలోనే అత్యంత సుంద‌ర‌మైన ప్ర‌దేశాల్లో ఒక‌టి కావ‌డంతో టూరిస్టులు పెద్ద సంఖ్యలో అక్క‌డికి వెళ్తున్నారు. కానీ ఇటీవ‌ల మినీ స్విట్జ‌ర్లాండ్‌గా పేరొందిన ప‌హ‌ల్గాంలో ఉగ్ర‌వాదులు పాశ‌వికంగా దాడి చేసి 26 మందిని పొట్ట‌న పెట్టుకోవ‌డంతో ఒక్క‌సారిగా ప‌రిస్థితులు మారిపోయాయి. క‌శ్మీర్‌లో ప‌ర్యాట‌కుల‌పై జ‌రిగిన అతి పెద్ద దాడి ఇదే. ఈ దాడి జ‌రిగిన మ‌రుస‌టి రోజు క‌శ్మీర్ స్తంభించిపోయింది. అక్క‌డున్న ప‌ర్యాట‌కులంతా వెన‌క్కి రావ‌డం మొద‌లుపెట్టారు.

త‌ర్వాతి రోజుల‌కు బుకింగ్స్ చేసుకున్న వాళ్లంతా ర‌ద్దు చేసుకోవ‌డం మొద‌లుపెట్టారు. ఒక్క‌సారిగా క‌శ్మీర్ ప‌ర్యాట‌కులు లేక వెల‌వెల‌బోయింది. హోట‌ళ్లు ఖాళీ.. టూరిస్టుల మీద ఆధార‌ప‌డ్డ వాళ్లంతా ఖాళీ. మొత్తంగా అక్క‌డ ప‌రిస్థితి దారుణంగా ఉంది. క‌శ్యీర్‌కు వెళ్ల‌డానికి అంద‌రూ భ‌య‌ప‌డిపోతున్న త‌రుణంలో తెలుగు వారికీ సుప‌రిచితుడైన‌ ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అతుల్ కుల‌క‌ర్ణి అక్క‌డ ప‌ర్య‌టిస్తుండ‌డం విశేషం. ఆయ‌న ఒక మెసేజ్ ఇవ్వ‌డాడ‌నికే అక్క‌డికి వెళ్లారు.

క‌శ్మీర్‌కు ఎవ్వ‌రూ రావొద్ద‌నే సంకేతాల‌ను టెర్రరిస్టులు ఇచ్చార‌ని.. అలాగే దేశంలో ఒక విభ‌జ‌న తేవాల‌ని చూశార‌ని.. ఇది జ‌ర‌గ‌నివ్వ‌కూడ‌ద‌ని అతుల్ పేర్కొన్నారు. పహ‌ల్గామ్ ఘ‌ట‌న త‌ర్వాత 90 శాతం బుకింగ్స్ ర‌ద్ద‌య్యాయ‌ని.. క‌శ్మీర్ ప్ర‌జ‌లు తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు అతుల్. క‌శ్మీర్‌కు ప‌ర్యాట‌కులు రాకూడ‌ద‌న్న టెర్ర‌రిస్టుల ల‌క్ష్యాన్ని మ‌నం ఎందుకు నెర‌వేర్చాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. క‌శ్మీర్ అద్భుత‌మైన ప్ర‌దేశం అని.. అక్క‌డికి దేశ ప్ర‌జ‌లంతా రావాల‌ని.. ఉగ్ర‌వాదుల మీద మ‌న పోరాటం ఆగ‌ద‌ని.. క‌శ్మీర్‌కు తాము మ‌ద్ద‌తుగా ఉంటామ‌ని చాటాల‌ని అతుల్ పిలుపునిచ్చారు. తాను ఇక ముందూ క‌శ్మీర్‌కు వ‌స్తూనే ఉంటాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అతుల్ చ‌ర్య‌, ఆయ‌న మాట‌లు ప్ర‌శంస‌లు అందుకుంటున్నాయి.