మే 1 వచ్చేస్తోంది. అందరి చూపు నాని హిట్ 3 ది థర్డ్ కేస్ మీదే ఉంది. అంచనాలకు తగ్గట్టే జరుగుతున్న ప్రమోషన్లు ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటిదాకా ఒకే ట్రైలర్ తో సరిపెట్టిన దర్శకుడు శైలేష్ కొలను అన్ని సర్ప్రైజ్ లు థియేటర్లో చూడమని ఊరిస్తున్నాడు. ఇదిలా ఉండగా అదే రోజు వస్తున్న సూర్య రెట్రోకి బజ్ అంతగా లేకపోవడం అభిమానులను టెన్షన్ పెడుతోంది. ముఖ్యంగా ట్రైలర్ వల్ల కొంచెం అయోమయం కలగడం మాస్ వర్గాల్లో హైప్ తగ్గించింది. కంగువ డిజాస్టర్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ నాని కనక రేసులో లేకపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉందేమో కానీ ఇప్పుడలా కాదు.
రెట్రోని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సితార సంస్థ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం తమ కింగ్ డమ్ హీరో విజయ్ దేవరకొండని గెస్టుగా తీసుకొస్తోంది. ఈ వేడుకలో ఏమైనా మెరుపులు ఉంటాయేమో చూడాలి. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ గత సినిమా జిగర్ తండా డబుల్ ఎక్స్ తెలుగులో ఆడలేదు. యావరేజ్ అయినా ఏమో అనుకోవచ్చు కానీ డిజాస్టర్ కొట్టింది. అంతకు ముందు మహాన్ ఓటిటిలో వచ్చింది. జగమే తంతిరంకు పూర్ కంటెంట్ అంటూ విమర్శలు వచ్చి పడ్డాయి. పేట ఒక్కటే డీసెంట్ గా ఆడింది. దీంతో రెట్రోకి టాలీవుడ్ లో డైరెక్టర్ బ్రాండ్ పని చేయడం లేదు. మొత్తం బరువు సూర్య మీదే పడుతోంది. బిజినెస్ కి కూడా అతనే కీలకం.
హిట్ 3 కనక హిట్ టాక్ తెచ్చుకుంటే రెట్రోకి ఇబ్బందులు తప్పవు. అసలే మండే ఎండల్లో జనం ఆచితూచి థియేటర్లకు వస్తున్నారు. గత రెండు నెలల్లో ఒకటి రెండు మినహాయించి ఇంకే సినిమాకు మొదటి రోజు నాలుగు షోలు హౌస్ ఫుల్స్ పడిన దాఖలాలు లేవు. ఆ బాకీ అంతా నాని తీరుస్తాడనే నమ్మకం బయ్యర్లలో ఉంది. ఒకవేళ రెట్రో కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే థియేటర్లకు మరింత బూస్ట్ దక్కుతుంది. హీరోయిన్ పూజా హెగ్డే సైతం ఫామ్ లో లేదు. సంతోష్ నారాయణన్ అందించిన సంగీతంలో ఒక పాట మాత్రమే రీచ్ తెచ్చుకుంది. ఇన్ని ప్రతికూలతలు మధ్య రెట్రో ఏదైనా మేజిక్ చేస్తేనే జనం మెచ్చుకుంటారు.