ఫ్యామిలీ థ్రిల్లర్ అనే కొత్త జానర్ సృష్టించి బ్లాక్ బస్టర్స్ సాధించిన దృశ్యం నుంచి ఇప్పటిదాకా రెండు భాగాలొచ్చాయి. మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్, కన్నడలో రవిచంద్రన్ చేసుకుని మంచి విజయాలు సాధించారు. అయితే మూడో భాగం స్క్రిప్ట్ సిద్ధమవుతుందనే వార్తల నేపథ్యంలో కొత్త గందరగోళం నెలకొంది. దృశ్యం 3 ఒరిజినల్ మోహన్ లాల్ వెర్షన్ ని ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న ఉన్నారు నిర్మాత ఆంటోనీ పెరువంబూర్. దర్శకుడు జీతూ జోసెఫ్ కథని సిద్ధం చేశారని, ఫైనల్ వెర్షన్ ని త్వరలోనే లాక్ చేసి ది కంక్లూజన్ పేరుతో ముగింపు ఇస్తారట.
ఒకవేళ మోహన్ లాల్ వెర్షన్ అన్ని భాషల్లో చేసే పనైతే వెంకీ, అజయ్ లకు ఒక మంచి ఛాన్స్ మిస్ అవుతుంది. కానీ ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే దృశ్యం అనగానే వెంకటేష్ తప్ప వేరే ఆప్షన్ అంటే మన ప్రేక్షకులు అంగీకరించకపోవచ్చు. అంతగా రాంబాబు బ్రాండ్ ముద్రించుకుపోయింది. అలాంటప్పుడు కొత్తగా మోహన్ లాల్ వచ్చి దృశ్యం 3లో కనిపిస్తే బిజినెస్ పరంగా రిస్క్ అవుతుంది. ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ అజయ్ దేవగన్ మూడో భాగం కోసం వేరే కథను సిద్ధం చేయిస్తున్నాడట. దర్శకత్వం ఎవరనేది ప్రస్తుతానికి తేల్చలేదని బాలీవుడ్ టాక్.
వీళ్లిద్దరి సంగతి ఎలా ఉన్న వెంకటేష్ మాత్రం దృశ్యం 3 ప్రతిపాదన వస్తే చేద్దాం లేదంటే లైట్ తీసుకుందామనే ధోరణిలో ఉన్నట్టు తెలిసింది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న వెంకీ దగ్గరకి థర్డ్ పార్ట్ కు సంబంధించిన ప్రతిపాదన రాలేదని తెలిసింది. దృశ్యం 2 తెలుగులో కూడా జీతూ జోసెఫ్ చేసినప్పటికీ కొనసాగింపు గురించి ఇద్దరి మధ్య చర్చలు లాంటివేవీ జరగలేదట. ఇంత తక్కువ బడ్జెట్ లో సీక్వెల్స్ మీద క్రేజ్ వచ్చేలా చేసుకున్న ఒకే సినిమాగా దృశ్యం ప్రత్యేకంగా నిలిచిపోతుంది. మరి వెంకటేష్ ని మరోసారి చూడటం జరుగుతుందా లేక మిస్సవుతుందా ఇంకొద్ది వారాల్లో తేలొచ్చు.