కొన్ని వారాలుగా డ్రైగా ఉంటున్న టాలీవుడ్ బాక్సాఫీస్ కు ప్రాణం పొసే బాధ్యత కళ్యాణ్ రామ్ మీద పడింది. ఈ రోజు విడుదలవుతున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి మీద బయ్యర్ వర్గాలు చాలా నమ్మకం పెట్టుకున్నాయి. ఫిబ్రవరి నుంచి చూసుకుంటే తండేల్, కోర్ట్, మ్యాడ్ స్క్వేర్ మినహాయించి ఎగ్జిబిటర్లకు పెట్టుబడులు వెనక్కు ఇచ్చిన సినిమాలు పెద్దగా లేవు. ఖచ్చితంగా హిట్టు కొడతాయని నమ్మకం పెట్టుకున్న రాబిన్ హుడ్, జాక్ లాంటివి తీవ్రంగా నిరాశపర్చడం చాలా నష్టాలు తీసుకొచ్చింది. నిన్న రిలీజైన ఓదెల 2కి సైతం మిశ్రమ స్పందనే కనిపిస్తోంది. వీకెండ్ అయ్యాక ఏ స్టేటస్ వైపు వెళ్తుందనేది తేలుతుంది
పరిస్థితి ఇలా ఉండటం వల్లే థియేటర్లలో సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వేసవి సీజన్ లో ఇలా దారుణమైన ఆక్యుపెన్సీలు నమోదు కావడం ఇండస్ట్రీకి ఎంత మాత్రం మంచిది కాదు. ఒకపక్క పిల్లలు సెలవుల్లో ఉంటే వాళ్లకు ఒక మంచి ఆప్షన్ లేకపోవడం విచారకరం. అందకే ప్రాపర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వస్తున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే ఈ రోజు అనుష్క ఘాటీ చూడాల్సింది. కానీ పలు కారణాల వల్ల డేట్ మిస్ చేసుకుంది. డెవిల్ ఫ్లాప్ అయ్యాక కళ్యాణ్ రామ్ ఏకంగా ఏడాదిన్నర దాకా గ్యాప్ తీసుకుని ఈ ప్రాజెక్టు కోసమే అంకితమైపోయాడు.
ప్రమోషన్లు చూశాక ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది. జూనియర్ ఎన్టీఆర్ అతిధిగా ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ కట్, విజయశాంతిని హైలైట్ చేస్తూ మదర్ సెంటిమెంట్ ని ఫ్యామిలీ వర్గాలకు టార్గెట్ చేసిన విధానం ఇవన్నీ ఓపెనింగ్స్ తెచ్చేలానే ఉన్నాయి. దేవర, డాకు మహారాజ్ తర్వాత నందమూరి అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్నాయి. ఇది కూడా వాటి సరసన చేరి హిట్టవుతుందనే నమ్మకం వాళ్ళలో ఉంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ విలన్ గా నటించాడు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా మేజర్ ఫేమ్ సయి మంజ్రేకర్ హీరోయిన్ గా చేసింది.