పైడిపల్లికి అమీర్ ఖాన్ పచ్చ జెండా ?

లాల్ సింగ్ చద్దా దెబ్బకు అమీర్ ఖాన్ బాలీవుడ్ డైరెక్టర్లను నమ్మడం కన్నా సౌత్ దర్శకులతో చేతులు కలపడం నయమని భావిస్తున్నాడు. అందులో భాగంగానే రజనీకాంత్ కూలిలో ప్రత్యేక పాత్రకు ఒప్పుకున్నాడు. లోకేష్ కనగరాజ్ తో త్వరలోనే ఒక ఫుల్ లెన్త్ మూవీ ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది. ఒక సూపర్ హీరో సబ్జెక్టుతో ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ కుదిరిందని చెన్నై టాక్. అయితే లోకేష్ కూలి అయ్యాక ఖైదీ 2కి సన్నాహాలు చేసుకుంటున్నాడు. సో ఒకవేళ అమీర్ ఖాన్ నిజంగా ఎస్ చెప్పినా కార్యరూపం దాల్చడానికి టైం పడుతుంది. అసలు మ్యాటర్ ఇది కాదు. మన టాలీవుడ్ దర్శకుడి గురించి.

2023లో విజయ్ వారసుడు తీశాక వంశీ పైడిపల్లికి చాలా గ్యాప్ వచ్చేసింది. రెండేళ్లు గడిచిపోయాయి కానీ ఇప్పటిదాకా కొత్త చిత్రం మొదలవ్వలేదు. వారసుడు కమర్షియల్ గా డబ్బులు తెచ్చినా కంటెంట్ పరంగా సీరియల్ లా ఉందని, పాతకథకు కొత్త పూత పూశారనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. ఆ కారణంగా స్టార్ హీరోని సెట్ చేసుకొవడం ఆలస్యమయ్యిందనే ప్రచారం కూడా ఉంది. మరి అమీర్ ఖాన్ కి ఎలాంటి లైన్ చెప్పి ఉంటాడనేది ఆసక్తికరం. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లోనే వంశీ పైడిపల్లి బిజీగా ఉన్నట్టు తెలిసింది. అయితే ఫైనల్ వెర్షన్ నచ్చితేనే అమీర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు.

ఒకవేళ నిజంగా ఈ కాంబో కనక కుదిరితే వంశీ పైడిపల్లికి అంతకంటే పెద్ద జాక్ పాట్ ఉండదు. మున్నా ఫ్లాప్ మినహాయించి తన కెరీర్ లో మిగిలినవన్నీ హిట్లే. బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకున్నాయి. అందుకే విజయ్ అడగ్గానే స్టోరీ నచ్చేసి వారసుడు ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు అమీర్ ఖానే ఆసక్తి చూపించడమంటే మాములు విషయం కాదు. ఈ కలయిక కోసం మైత్రి మూవీ మేకర్స్ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అయినా స్టార్ హీరోలు గ్యాప్ తీసుకుంటే ఏదో అనుకోవచ్చు కానీ అనుభవమున్న వంశీ పైడిపల్లి లాంటి దర్శకులు సైతం ఇంత సమయం తీసుకోవడం విచిత్రమే.