గాయకుడి విమర్శ…రెహమాన్ చెంపపెట్టు సమాధానం

సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన స్థాయి ఆల్బమ్స్ రావడం లేదనేది వాస్తవమే. ఛావా, పొన్నియిన్ సెల్వన్ హిట్టయినా వాటిలో వింటేజ్ రెహమాన్ వినిపించలేదన్నది మ్యూజిక్ లవర్స్ కంప్లయింట్. ఇదిలా ఉండగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ అభిజిత్ ఇటీవలే రెహమాన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. గాయని గాయకులకు బదులు రెహమాన్ టెక్నాలజీ వాడుతున్నాడని, దానివల్ల ఎందరో ఉపాధి కోల్పోవడమే కాక ఒరిజినాలిటీ తగ్గుతోందని వాపోయారు. దీనికి స్పందించకుండా మౌనంగా ఉన్న రెహమాన్ తాజాగా ఓపెనయ్యారు.

ఆయన మాటల సారాంశం చూస్తే ఎంత చెంపపెట్టు సమాధానమో అర్థమవుతుంది. దుబాయ్ వేదికగా రెహమాన్ ఒక మహిళా ఆర్కెస్ట్రా ట్రూప్ ని ఏర్పాటు చేశారు. అందులో అరవై దాకా సభ్యులు ఉన్నారు. నిత్యం కొత్త సంగీతం సృష్టించడంలో నిమగ్నమవ్వడం, మెళకువలు నేర్చుకోవడంతో పాటు కన్సర్ట్స్ లో పాలు పంచుకోవడం వీళ్ళ బాధ్యత. ఇందుకు గాను నెల నెలా రెహమాన్ జీతాలు చెల్లిస్తున్నారు. ఛావా లాంటి గ్రాండియర్స్ కి రెండు వందల మందికి పైగా కంపోజింగ్, రికార్డింగ్ లో భాగం వహిస్తారు. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కాని సోషల్ మీడియాలో షేర్ చేసే అలవాటు రెహమాన్ కు లేదు.

సో అభిజిత్ చేసిన కామెంట్లకు రెహమాన్ నుంచి ధీటైన సమాధానం వచ్చినట్టే. ఈ అభిప్రాయభేదం వెనుక కారణం లేకపోలేదు. లాల్ సలాం కోసం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వాడి చనిపోయిన గాయకుల గాత్రాన్ని రీ క్రియేట్ చేసిన రెహమాన్ ఆ విషయంగా కొన్ని విమర్శలు అందుకున్నాడు. వాళ్లలో అభిజిత్ ఉండటం ఫైనల్ ట్విస్ట్. ఇదంతా ఎలా ఉన్నా అతని మీద తనకు చాలా గౌరవం ఉందని. అది ఎప్పటికీ తగ్గదని, స్వీట్స్ కూడా పంపిస్తానని రెహమాన్ చెప్పడం చూస్తే ఈ టాపిక్ కి ఇంతటితో చెక్ పడినట్టే అనుకోవాలి. రామ్ చరణ్ పెద్దికి మ్యూజిక్ ఇస్తున్న రెహమాన్ మీద మెగా ఫ్యాన్స్ బోలెడు నమ్మకం పెట్టుకున్నారు.