దేవిశ్రీ ప్రసాద్ తీసుకున్న ‘గుడ్’ నిర్ణయం

భారీ అంచనాల మధ్య విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీ చూసి అజిత్ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. దర్శకుడు అధిక్ రవిచందర్ తమ హీరోని చూపించిన విధానం పట్ల, తలా మీద అతని ఆరాధనకు ఫిదా అయిపోతున్నారు. అభిమానుల కోణంలో చూసుకుంటే అజిత్ నిరాశ పరచలేదు కానీ కంటెంట్ పరంగా సాధారణ ప్రేక్షకుల నుంచి యునానిమస్ టాక్ అయితే రాలేదు. తమిళం సంగతి ఓకే కానీ మిగిలిన బాషల నుంచి కూడా మిక్స్డ్ లేదా బిలో యావరేజ్ టాకే నడుస్తోంది. అయితే సినిమాకు సంబంధించి నెగటివ్ కోణంలో అనిపించిన పాయింట్ ఒకటుంది. అదే జివి ప్రకాష్ కుమార్ సంగీతం.

నిజానికి గుడ్ బ్యాడ్ అగ్లీ అనౌన్స్ చేసినప్పుడు తొలుత ఉన్న పేరు దేవిశ్రీ ప్రసాద్. కానీ గత ఏడాది పుష్ప 2 టైంలో తన స్థానంలో జివి వచ్చి చేశారు. దీనికి కారణం విభేదాలని అందరూ అనుకున్నారు కానీ అసలు మ్యాటర్ బొమ్మ చూశాక అర్థమయ్యింది. సినిమాలో అవసరానికి మించి పాత వింటేజ్ పాటలు, బిజిఎంలు చాలా ఎక్కువగా వాడేశారు. ఇళయరాజా, దేవా, విద్యాసాగర్ తదితరుల కంపోజింగ్ లో వచ్చిన ఓల్డ్ ఛార్ట్ బస్టర్స్ ని ఎక్కడబడితే అక్కడ పెట్టేశారు. దేవి రీమిక్సులకు అస్సలు ఒప్పుకోడు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు. గద్దలకొండ గణేష్ వదలుకున్నది అందుకే.

ఇప్పుడీ గుడ్ బ్యాడ్ అగ్లీని నో చెప్పడానికి రీజన్ కూడా ఇదే అయ్యుండొచ్చు. కంటెంట్ ఎలా ఉందనేది పక్కనపెడితే జివి ప్రకాష్ మ్యూజిక్ మరీ లౌడ్ గా అనిపించింది. ఒకదశ దాటాక చిరాకు పుట్టించింది కూడా. తనదైన మార్కులో ఒక్క పాట లేకపోగా ఉన్నవాటిలో మెప్పించినవి పాత సాంగ్స్ కావడం అసలు ట్విస్టు. అలాంటప్పుడు ఇతని గొప్పదనాన్ని చెప్పేందుకు ఏముంటుంది. దేవిశ్రీ ప్రసాద్ నిర్ణయం ఒకరకంగా గుడ్ అనే చెప్పాలి. పూర్తి స్వాతంత్రం లేకుండా పదే పదే పాత ట్యూన్స్ వాడుకుంటే ఫ్యాన్స్ కేమో కానీ సాధారణ ఆడియన్స్ కి  ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఒరిజినాలిటీ లేనప్పుడు అంతేగా.