మైత్రి రెండు గుర్రాల స్వారీ ఏ ఫలితమిస్తుందో

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థగా వెలిగిపోతున్న మైత్రి మూవీ మేకర్స్ కి ఈ రోజు చాలా కీలకం. తెలుగులో కాకుండా ఇతర భాషల్లో పెద్ద హీరోలతో నిర్మించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల కానుండటం వాళ్ళ భవిష్యత్ ప్రణాళికల మీద ప్రభావం చూపించబోతోంది. గుడ్ బ్యాడ్ ఆగ్లీకి తమిళనాడులో భారీ బజ్ ఉంది. చాలా గ్యాప్ తర్వాత అజిత్ చేసిన ఊర మాస్ ఎంటర్ టైనర్ కావడంతో ఫ్యాన్స్ దీని మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు. దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ ని నమ్మి భారీ బడ్జెట్ కుమ్మరించారు. ఇతర భాషల్లో బజ్ లేకపోయినప్పటికీ ఒరిజినల్ వెర్షన్ బ్లాక్ బస్టర్ అయితే మైత్రికి కాసుల పంటే.

కాకపోతే విడాముయార్చితో పాటు గత చిత్రాల ఫలితం అజిత్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తోందనేది అడ్వాన్స్ బుకింగ్స్ లో తేటతెల్లమవుతోంది. ప్రమోషన్లు చేసే అవకాశం లేకపోవడంతో పాటు అజిత్ పబ్లిసిటీ దూరంగా ఉండే వైనం కొంత ప్రతికూలంగా మారి సాధారణ ప్రేక్షకులను గుడ్ బ్యాడ్ అగ్లీ వైపు చూసేలా చేయలేకపోతోంది. ఈ ప్రతికూలతను కనక పాజిటివ్ టాక్ తట్టుకుంటే హ్యాపీగా బయట పడొచ్చు. ఇక హిందీలో సన్నీ డియోల్ తో చేసిన జాట్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. గదర్ 2 తర్వాత చేసిన మూవీగా మాస్ ఆడియన్స్ లో దీని మీద పెద్ద అంచనాలు నెలకొన్నాయి.

దర్శకుడు గోపిచంద్ మలినేని సౌత్ స్టైల్ లో తీయడం, క్యాస్టింగ్ లో అధిక భాగం తెలుగు వాళ్ళే ఉండటం వల్ల బాలీవుడ్ ఫ్లేవర్ తగ్గిన ఫీలింగ్ జనాల్లో కనిపిస్తోంది. ఇది దాటుకునేలా టాక్ వస్తే జాట్ ఖచ్చితంగా జాక్ పాట్ అవుతుంది. తమన్ సంగీతం సైతం పెద్దగా రిజిస్టర్ కాలేకపోయింది. సో జవాన్, పఠాన్ రేంజ్ లో టాక్ వస్తే సులభంగా వంద కోట్ల నెట్ దాటేయొచ్చు. జాట్ కి మైత్రితో పాటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ భాగస్వామి కావడం మరో గమనించాల్సిన విషయం. మరి మైత్రి రెండు గుర్రాల స్వారీ ఎలాంటి ఫలితం ఇస్తుందో, మరిన్ని సినిమాలు తీసేందుకు ప్రేరేపిస్తుందో లేదో చూడాలి.