సెకండ్ ఇన్నింగ్స్….బాలయ్య సరైన మాట

మాములుగా స్టార్ హీరోల విషయంలో కంబ్యాక్, సెకండ్ ఇన్నింగ్స్ పదాలు సాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు లేదా వరసగా ఫ్లాపులు చూసినప్పుడు మీడియా వర్గాలు ఈ పదాలను వాడుతాయి. కానీ బాలకృష్ణ మాత్రం తనకిది ఒంటబట్టదని తేల్చి చెప్పేశారు. ఆదిత్య 369 ఏప్రిల్ 4 రీ రిలీజ్ కాబోతున్న సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికాయన విచ్చేసి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ తనకు తెలియదని, విజయవంతమైన సినిమాలు, మూడుసార్లు ఎమ్మెల్యే, అన్ స్టాపబుల్ షో, క్యాన్సర్ ఆసుపత్రి ఇలా అన్ని చేసుకుంటూ వచ్చానన్నారు.

కొడుకుని, మనవడిని అందరిని మెప్పిస్తూ ఇప్పటి రెండు జనరేషన్లకు కనెక్ట్ అయ్యేలా అన్ని జానర్లలో చిత్రాలు చేయడం నాన్న నుంచి అందుకున్న స్ఫూర్తిగా చెప్పుకొచ్చారు. మాయాబజార్, సీతారామ కళ్యాణం, శ్రీ కృష్ణ పాండవీయం లాంటి క్లాసిక్స్ సరసన ఆదిత్య 369 ఉంటుందని, ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే తనకు ఈ సినిమా గొప్ప అనుభూతిని మిగిల్చిందని వివరించారు. భైరవ ద్వీపంలో కురూపి లాంటి సాహసవంతమైన పాత్రలను పోషించడానికి కారణాలు వివరించారు. అంతే కాదు ఆదిత్య 369 సీక్వెల్ త్వరలోనే ప్రారంభమవుతుందని, ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదని ప్రత్యేకంగా నొక్కి చెప్పారు.

బాలయ్య అన్నారని కాదు కానీ నిజంగానే ఆయనకు సెకండ్ ఇన్నింగ్స్ అవసరం ఎప్పుడూ పడలేదు. ఏనాడూ గ్యాప్ తీసుకోలేదు. ఫ్లాపులు పలకరిస్తున్నా సరే వేగంగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లు ఎన్నో సాధించారు. అఖండతో మొదలుపెట్టి మొన్నటి డాకు మహారాజ్ దాకా బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు అఖండ 2 తాండవం మీద అంచనాలు పీక్స్ కు చేరుకుంటున్నాయి. ఇలాంటి టైంలో ఆదిత్య 369 లాంటి మూడు దశాబ్దాల పాత క్లాసిక్ ని మళ్ళీ చూసే ఛాన్స్ రావడం కొత్త తరం ప్రేక్షకుల అదృష్టమే. మంచి ఓపెనింగ్స్ తో పాటు భారీ స్పందన దక్కే అవకాశాలున్నాయి.