ఇటీవలే పెళ్లి చేసుకుని శ్రీమతిగా మారిన కీర్తి సురేష్ కు బాలీవుడ్ డెబ్యూ ‘బేబీ జాన్’ మాములు షాక్ ఇవ్వలేదు. కొత్త పెళ్లి కూతురనే సంగతి మర్చిపోయి మరీ ప్రమోషన్ల కోసం చెన్నై టు ముంబై నాన్ స్టాప్ గా తిరిగిన మహానటికి హిందీ తెరంగేట్రం డిజాస్టర్ కావడం ఊహించనిది. అట్లీ నిర్మాణం, అందులోనూ తేరి రీమేక్ ఇంకేముంది గ్యారెంటీ హిట్టని ఒప్పేసుకుంది. కట్ చేస్తే ఫలితం రివర్స్ కొట్టింది. తన సోలో సినిమాలు కూడా అంతగా వర్కౌట్ కావడం లేదు. మిస్ ఇండియా, రఘు తాత, గుడ్ లక్ సఖి లాంటి థియేటర్ రిలీజులతో పాటు చిన్ని, పెంగ్విన్ లాంటి ఓటిటి మూవీస్ సైతం తీవ్రంగా నిరాశపరిచాయి.
వీటి దెబ్బకు ఎప్పటి నుంచో నిర్మాణంలో ఉన్న ‘రివాల్వర్ రీటా’ విడుదలకు నోచుకోవడం లేదు. ఆగిందో సాగుతోందో కూడా అప్డేట్ లేదు. సుహాస్ తో చేస్తున్న ‘ఉప్పు కప్పురంబు’ ఏ దశలో ఉందో క్లారిటీ లేదు. అయినా సరే కీర్తి సురేష్ కు రెండు క్రేజీ ఆఫర్లు లైన్ లో ఉన్నట్టు టాక్. వాటిలో ఒకటి ఏకంగా రన్బీర్ కపూర్ సరసన ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ కోసం ప్రతిపాదనలో ఉందట. అయితే అతను రామాయణం, లవ్ అండ్ వార్, యానిమల్ పార్క్ తో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నిజంగా సాధ్యమవుతుందానే అనుమానాలు లేకపోలేదు. నూటికి తొంభై శాతం డౌటే కానీ ముంబై సర్కిల్స్ టాక్ అయితే ఉంది.
ఇక రెండోది నితిన్ దర్శకుడు వేణు యెల్దండి కాంబోలో తెరకెక్కబోయే ఎల్లమ్మలో టైటిల్ రోల్. ఇది కూడా అధికారిక ప్రకటన రాలేదు కానీ దాదాపు ఖరారు కావొచ్చని అంటున్నారు. సమంతా లాగా మరీ లేట్ చేయకుండా వీలైనంత వేగంగా సినిమాలు చేయడం కీర్తి సురేష్ కు అవసరం. మహానటితో వచ్చిన ఫేమ్, సర్కారు వారి పాటలో మహేష్ బాబు లాంటి స్టార్ తో జత కట్టిన అవకాశం తన కెరీర్ ని ఆశించిన స్థాయిలో ముందుకు తీసుకెళ్లలేదు. ఇప్పుడు ప్రతిపాదనలో ఉన్నవి కనక ఓకే అయితే మంచి ప్లానింగ్ చేసుకోవచ్చు. పెళ్లయిన భామలకు అసలే ఆఫర్లు తక్కువ. వచ్చిన వాటిని వీలైనంత వాడేసుకుని లాభపడాలి.