కొత్త దర్శకుడికి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ?

ఎన్నో సినిమాలకు పని చేసినప్పటికీ రచయితలుగా సామజవరగమనతో గుర్తింపు తెచ్చుకున్న భాను – నందులో భాను భోగవరపు త్వరలో విడుదల కాబోతున్న రవితేజ మాస్ జాతరతో డైరెక్షన్ డెబ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. రెండోవాడైన నందు ఈ అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇది కొలిక్కి వచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్. అతను చెప్పిన ఒక ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీ బాగా నచ్చడంతో వెర్షన్ డెవలప్ చేయమని చెప్పాడట. ఒకవేళ దాంతో కనక సంతృప్తి చెందితే వీలైనంత త్వరగా పట్టాలు ఎక్కిద్దామని చెప్పినట్టు సమాచారం. హీరోయిన్ కృతి శెట్టి పేరు పరిశీలనలో ఉంచారని సమాచారం.

అఖిల్ ప్రస్తుతం లెనిన్ తో బిజీగా ఉన్నాడు. వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళికిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రస్టిక్ విలేజ్ డ్రామాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. దీని తర్వాత యువి క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ ని పరిచయం చేస్తూ అఖిల్ ఒక ఫాంటసీ మూవీ చేయాల్సి ఉంది. అయితే రకరకాల కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వస్తోంది. విశ్వంభర ఆలస్యం ఒక కారణంగా చెబుతున్నారు కానీ మరికొంత సమయం పట్టేలా ఉంది. అప్పటిదాకా వెయిటింగ్ చేయడం ఎందుకనే ఆలోచనతో నందుకు పచ్చజెండా ఊపి ఉండొచ్చని మరో టాక్. అధికారిక ప్రకటన వచ్చేదాకా ఖరారుగా చెప్పలేం.

ఏజెంట్ దెబ్బకు ఎక్కువ గ్యాప్ తీసుకున్న అఖిల్ ఇకపై వేగం పెంచాలని నిర్ణయించుకున్నాడు. మరీ నెమ్మదిగా ఉండటం అభిమానుల్లో తీవ్ర అసంతృప్తిని కలగజేస్తోంది. తండేల్ సూపర్ హిట్ తో నాగచైతన్య ట్రాక్ లోకి వచ్చేశాడు. కుబేర, కూలి మీదున్న హైప్ చూస్తే నాగార్జునకు సక్సెస్ లు పడటం ఖాయమే. ఆయన సోలో హీరో కాకపోయినా కీలక పాత్రలు దక్కించుకున్నారు. అంతకు ముందు నా సామిరంగ హిట్టు క్యాటగిరీకి చేరింది. ఇక బ్యాలన్స్ ఉన్నది అఖిలే. లెనిన్ ఈ ఏడాదే రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీపావళికి అనుకుంటున్నారు కానీ స్లాట్స్ చాలా టైట్ ఉన్నాయి.