ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో హిందీ ‘గజిని’ ఒకటి. హాలీవుడ్ మూవీ ‘మొమెంటో’ స్ఫూర్తితో తమిళంలో సూర్య హీరోగా మురుగదాస్ ఈ పేరుతో రూపొందించిన చిత్రం తమిళంలోనే కాక తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత దీన్ని అదే పేరుతో ఆమిర్ హీరోగా హిందీలో రీమేక్ చేశాడు మురుగదాస్. 2008లోనే ఈ చిత్రం రూ.200 కోట్ల వసూళ్లు రాబట్టి పాత ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసింది. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని మురుగదాస్ ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు కానీ కుదరడం లేదు. ఐతే ఇప్పుడు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు స్వయంగా ఆయనే చెప్పాడు.
గత కొన్నేళ్లలో వరసగా డిజాస్టర్లు ఇచ్చిన మురుగ.. హిందీ మూవీ ‘సికందర్’తో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన ‘సికందర్’ రంజాన్ కానుకగా ఈ నెల చివర్లో విడుదల కానుంది. ఈ సినిమా పని మొదలవడానికి ముందే ముంబయిలో ఆమిర్ ఖాన్ను కలిసినట్లు మురుగదాస్ వెల్లడించాడు. అప్పుడు గజిని-2 గురించి, వేరే కథల మీద తమ మధ్య చర్చలు జరిగాయన్నాడు.
ఐతే తర్వాత తాను ‘సికందర్’, ఆమిర్ ‘సితారే జమీన్ పర్’ చిత్రాలతో బిజీ అయ్యామని.. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక ఇద్దరం మళ్లీ కూర్చుంటామని.. గజిని-2 ఐడియాలపై డిస్కస్ చేస్తామని ఓ ఇంటర్వ్యూలో మురుగదాస్ వెల్లడించాడు. ఐతే గజిని-2 కార్యరూపం దాల్చాలంటే ముందు ‘సికందర్’ బాగా ఆడాలి. మురుగదాస్ ట్రాక్ రికార్డు ఇప్పటికే బాగా దెబ్బ తినేసింది. ‘సికందర్’ కూడా ఆడకపోతే.. అసలే ‘లాల్ సింగ్ చడ్డా’తో గట్టి ఎదురు దెబ్బ తిన్న ఆమిర్, మురుగదాస్తో సినిమా చేసే సాహసం చేయకపోవచ్చు.