వావ్.. ఇది మెగా మెగా వెబ్ సిరీస్

దర్శకుల్లో మణిరత్నం, గౌతమ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్, కేవీ ఆనంద్.. నటీనటుల్లో సూర్య, అరవింద్ స్వామి, సిద్దార్థ్, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, నిత్యా మీనన్, ఐశ్వర్యా రాజేష్, రేవతి.. సంగీత దర్శకుల్లో ఏఆర్ రెహమాన్, డి.ఇమాన్, జిబ్రాన్, జస్టిన్ ప్రభాకరన్.. సినిమాటోగ్రాఫర్లలో సంతోష్ శివన్, మనోజ్ పరమహంస.. ఇంతమంది దిగ్గజాలు, ప్రముఖులు కలిసి ఒక ప్రాజెక్టు చేస్తే ఎలా ఉంటుంది? ఈ కలయిక నమ్మశక్యం కాకుండా ఉంది కదా. కానీ ఈ ఇంపాజిబుల్ కాంబినేషన్‌ను నిజం చేస్తున్నాడు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం.

180, నా నువ్వే చిత్రాల దర్శకుడు జయేంద్రతో కలిసి మణిరత్నం నిర్మించబోయే మెగా వెబ్ సిరీస్ ముచ్చట ఇది. ‘నవరస’ పేరుతో భారీ స్థాయిలో ఈ సిరీస్ చేయబోతున్నాడు మణిరత్నం. తొమ్మిది ఎపిసోడ్లుగా తొమ్మిది కథలను చెప్పబోతోంది ఈ మెగా టీం.

ఈ తొమ్మిది కథల్లో ఒక్కోదాన్ని కేవీ ఆనంద్, గౌతమ్ మీనన్, బిజోయ్ నంబియార్, కార్తీక్ సుబ్బరాజ్, పొన్‌రామ్, హాలిత షలీమ్, కార్తీక్ నరేన్, రతీంద్రన్ ప్రసాద్, అరవింద్ స్వామి డైరెక్ట్ చేయబోతుండటం విశేషం. వీటికి తొమ్మిది మంది సినిమాటోగ్రాఫర్లు, ఎనిమిది మంది మ్యూజిక్ డైరెక్టర్లు పని చేయనున్నారు. 20 మందికి పైగా పేరున్న ఆర్టిస్టులు ఇందులో భాగం కాబోతున్నారు. ఈ సిరీస్‌తోనే సూర్య, విజయ్ సేతుపతి, సిద్దార్థ్ డిజిటల్ డెబ్యూ చేయబోతున్నారు.

ఇంతమంది ప్రముఖులు కలిసి ఒక వెబ్ సిరీస్ చేయడం ఇండియాలోనే ప్రథమం అని చెప్పాలి. వెబ్ సిరీస్‌ల్లో బాలీవుడ్ చాలా ముందున్నప్పటికీ.. ఈ స్థాయి ప్రాజెక్టును మాత్రం వాళ్లు కూడా టేకప్ చేయలేదు. నెట్‌ఫ్లిక్స్ దీని కోసం భారీగానే బడ్జెట్ పెడుతున్నట్లుంది. ఎగ్జైటింగ్ కాస్ట్, టెక్నీషియన్లతో రాబోతున్న ఈ సిరీస్ కచ్చితంగా సంచలనం సృష్టించే అవకాశముంది. మరి మణిరత్నం ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.