వామ్మో.. ప్రభాస్ సినిమాకు 600 కోట్లట

ప్రభాస్ చివరగా నటించిన ‘సాహో’ ముందు అనుకున్న బడ్జెట్ రూ.100 కోట్ల లోపే. ఐతే ఈ సినిమాకు ప్రభాస్ కమిట్మెంట్ ఇచ్చాకే ‘బాహుబలి’ రెండు భాగాలు ఒకదాని తర్వాత ఒకటి విడుదలయ్యాయి. వాటి కలెక్షన్ల ప్రభంజనం అనూహ్యమైన స్థాయిలో సాగింది. ప్రభాస్ రేంజ్ ఊహించిన విధంగా మారిపోయింది. దీంతో ‘సాహో’ బడ్జెట్‌ను పెంచుకుంటూ పోయారు. అది చివరికి ఏకంగా రూ.300 కోట్లు దాటిపోయింది.

ఐతే ఆ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వకపోవడంతో ప్రభాస్ కొత్త చిత్రం ‘రాధేశ్యామ్’కు కొంచెం బడ్జెట్ నియంత్రణ పాటిస్తున్నట్లున్నారు. కానీ దీని తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమాలకు మాత్రం అలాంటి పరిమితులేమీ లేనట్లుంది. ప్రభాస్ రెండు కొత్త సినిమాల బడ్జెట్ల గురించి వినిపిస్తున్న కబుర్లు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి.

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో ప్రభాస్ చేయబోయే ‘ఆదిపురుష్’ బడ్జెట్ రూ.500 కోట్లని బాలీవుడ్ మీడియా రిపోర్ట్ చేసింది. అదే నిజమైతే ఇండియాలో హైయెస్ట్ బడ్జెట్ మూవీగా ‘ఆదిపురుష్’ రికార్డులకెక్కడం ఖాయం. ఐతే ఈ రికార్డును మళ్లీ ప్రభాసే బద్దలు కొట్టబోతున్నాడని నిర్మాత అశ్వినీదత్ మాటల్ని బట్టి స్పష్టమవుతోంది. దత్ నిర్మాణంలో ఆయన అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక వీడియో ఇంటర్వ్యూలో దత్ మాట్లాడుతూ.. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.600 కోట్లని అన్నారు. నిర్మాత స్వయంగా చెప్పాడంటే నిజమే అనుకోవాలి. ఖర్చు పెట్టినా పెట్టకపోయినా అధికారికంగా అయితే ఆ బడ్జెట్టే ఖరారవుతుంది.

ఒక భారతీయ సినిమా మీద ఈ స్థాయి బడ్జెట్ పెట్టడం అన్నది అనూహ్యమైన విషయం. అంతగా ఖర్చు చేసి ఎలాంటి సినిమా తీస్తారన్నది ఉత్కంఠ రేకెత్తించే విషయం. కాగా.. అశ్విన్ సినిమా కంటే ముందు ప్రభాస్ ‘ఆదిపురుష్’ చేస్తాడని దత్ క్లారిటీ ఇచ్చారు. ఆ చిత్రం జనవరిలో మొదలై ఆరు నెలల్లో పూర్తవుతుందని.. ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమా చేయడానికి ప్రభాస్‌కు ఏడాదికి పైగా సమయం పడుతుందని ఆయన వెల్లడించారు.