సలార్ విలన్ పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నిర్మించిన ఎల్2 ఎంపురాన్ (లూసిఫర్ సీక్వెల్) కు సంబంధించి ఇప్పటిదాకా ప్రమోషన్లు ఊపందుకోకపోవడం అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. ఇతర భాషల సంగతమేమో కానీ మళయాలంలోనూ ఇలాంటి పరిస్థితి ఉండటం చూసి ఖంగారు పడుతున్నారు. ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ కోసం మహేష్ బాబు, రాజమౌళితో బిజీగా ఉన్న పృథ్విరాజ్ వీటిని పట్టించుకునే స్టేజిలో లేకపోవడంతో నిర్మాణ సంస్థ మీదే ఒత్తిడి ఉంది. మల్లువుడ్ టాక్ ప్రకారం ఎల్2 పబ్లిసిటీ ఇంకా మొదలుకాకపోవడానికి కారణం బిజినెస్ డీల్సేనట.
ఇప్పటిదాకా ఓటిటి ఒప్పందం జరగలేదని, నిర్మాత అడుగుతున్న దానికి డిజిటల్ కంపెనీలు ఆఫర్ చేస్తున్న మొత్తానికి చాలా వ్యత్యాసం ఉండటం వల్లే పెండింగ్ లో ఉంచారని అంటున్నారు. పైగా లైకా ప్రొడక్షన్ కావడంతో లాల్ సలామ్, ఇండియన్ 2, విడాముయార్చికి సంబంధించిన నష్టాల లావాదేవీలు పెండింగ్ లో ఉన్నాయట. దీంతో బయ్యర్ల నుంచి సహకారం సరిగా లేకపోవడంతో థియేటర్ అగ్రిమెంట్లలో ఆలస్యమవుతోందని తెలిసింది. ఈ జాప్యం వల్ల తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో అధిక శాతం స్క్రీన్లు పోటీలో ఉన్న రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్, వీరధీర శూర పార్ట్ 2 లాక్ చేసుకుంటున్నాయి.
ఇంతకీ ఎల్2 ఎంపురాన్ మార్చి 27 వస్తుందా అంటే అందులో డౌట్ అక్కర్లేదని కేరళ మీడియా చెబుతోంది. కానీ క్రమంగా అనుమానాలైతే పెరుగుతున్నాయి. లూసిఫర్ లాంటి వంద కోట్ల సినిమా సీక్వెల్ కి ఇలాంటి పరిస్థితి రావడం విచిత్రం. చాలా క్రేజీ క్యాస్టింగ్ తో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఎల్2 మీద మోహన్ లాల్ మాములు ఆశలు పెట్టుకోలేదు. గత చిత్రం బరోజ్ దారుణంగా డిజాస్టర్ కావడంతో ఆ గాయం దీంతో పూర్తిగా మానిపోతుందని ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడేమో ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు వచ్చి పడుతున్నాయి. తెలుగు హక్కులు ఎవరికి ఇచ్చారనే క్లారిటీ ఇంకా అఫీషియల్ గా రావాల్సి ఉంది.