SSMB 29 – కాశి నుంచి అడవుల దాకా

ఇండియా వైడ్ విపరీతమైన అంచనాలు మోస్తున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ని దర్శకుడు రాజమౌళి నిర్విరామంగా చేస్తున్నారు. ప్రధాన క్యాస్టింగ్ పాల్గొనగా ఇటీవలే ఒక కీలక షెడ్యూల్ జరిపిన సంగతి తెలిసిందే. అందులో చిన్న వీడియో లీకు రూపంలో బయటికి రావడంతో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసి ఒక్క సెల్ ఫోన్ సెట్లోకి అడుగు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విడుదల ఎప్పుడనేది బయటికి చెప్పడం లేదు కానీ జక్కన్న మనసులో ఏడాదిన్నర టార్గెట్ ఉందని తెలిసింది. పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం అవసరమైన పక్షంలో చిత్రీకరణలో జాప్యం ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారట.

ఈ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన మరో ఇంటరెస్టింగ్ అప్డేట్ ఆసక్తికరంగా ఉంది. కథ ప్రకారం మహేష్ పాత్ర ప్రయాణం కాశి నుంచి మొదలై అడవులకు వెళ్తుందట. ఇందు కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ లో మణికర్ణికా ఘాట్ తో పాటు కాశి పరిసరాలను ప్రత్యేకంగా సెట్ రూపంలో వేయడం దాదాపు కొలిక్కి వచ్చిందట. హీరో ఫారెస్ట్ కు ఎందుకు వెళ్లాల్సి వస్తుందనే కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆ పవిత్ర పుణ్యక్షేత్రం బ్యాక్ డ్రాప్ లోనే డిజైన్ చేశారని వినికిడి. రామాయణంలో హనుమాన్ నేపధ్యాన్ని విజయేంద్ర ప్రసాద్ స్ఫూర్తిగా తీసుకున్నారని వినిపిస్తోంది. అధికారికంగా ఇంకా తెలియలేదు.

ప్రస్తుతం మహేష్ బాబు, పృథ్విరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా పాల్గొంటుండగా అతి త్వరలో మిగిలిన ప్రధాన క్యాస్టింగ్ జత కాబోతున్నారు. పాటలు ఎన్ని ఉంటాయి, వాటిని ఎక్కడ షూట్ చేస్తారు లాంటి డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. ఎంఎం కీరవాణి కొన్ని ట్యూన్లు సిద్ధం చేసి ఉంచారు. త్వరలో హరిహర వీరమల్లు, విశ్వంభర పనులు ఉంటాయి కాబట్టి ఎస్ఎస్ఎంబి నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని వేసవి తర్వాత రాజమౌళితో చేరతారు. ఏప్రిల్ లో అఫీషియల్ గా రాజమౌళి ప్రెస్ మీట్ నిర్వహించే ప్లాన్ ఉందని అంటున్నారు కానీ టీమ్ నుంచి అయితే ఎలాంటి సమాచారం ప్రస్తుతానికి లేదు. వెయిట్ చేయాల్సిందే.