ఈ శుక్రవారం రీ రిలీజ్ కాబోతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి రాంగ్ టైమింగ్ ఎంచుకున్నారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు కానీ బుకింగ్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇటీవలే ఇంటర్ పరీక్షలు మొదలుకావడంతో పాటు ఇతర తరగతుల అన్యువల్ ఎగ్జామ్స్ ఇదే నెలలో ఉన్నాయి. వీటి వల్ల వసూళ్లు భారీగా ఉండవేమోనని మహేష్ బాబు, వెంకటేష్ అభిమానులు భావించారు. కానీ వాళ్ళ అంచనాలకు భిన్నంగా బుక్ మై షోలో సగటున రోజుకు 15 వేల నుంచి 20 వేల దాకా అడ్వాన్స్ టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇది కేవలం ఒక యాప్ నుంచి నమోదైన డేటా. డిస్ట్రిక్ట్ ఇతరత్రా ప్లాట్ ఫార్మ్స్ లెక్కలు వేరు.
నాలుగు రోజులు ముందుగానే ఇంత ట్రెండింగ్ లో రావడం విశేషమే. విచిత్రం ఏంటంటే మార్చి 7 రిలీజ్ కాబోతున్న మరో ఏడెనిమిది కొత్త సినిమాలు దేనికీ ఇంత బుకింగ్స్ లేవు. ఛావా తెలుగు డబ్బింగ్ మీద సిరిమల్లె చెట్టు ప్రభావం గట్టిగా ఉండబోతోంది. ముఖ్యంగా మెయిన్ థియేటర్స్ ని ఫ్యాన్స్ ఎగబడి బుక్ చేస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ సుదర్శన్, విశ్వనాథ్ లాంటి సింగల్ స్క్రీన్లలో మొదటి రోజు నాలుగు ఆటలు సోల్డ్ అవుట్ పెట్టేశారు. మల్టీప్లెక్సుల్లో సైతం అమ్మకాలు శరవేగంగా ఉన్నాయి. గత ఏడాది మురారి తర్వాత తిరిగి అంత స్థాయి స్పందన దీనికే వచ్చేలా ఉందని డిస్ట్రిబ్యూటర్స్ టాక్.
చూస్తుంటే ప్రేక్షకులు ఈ సినిమాకు గట్టిగానే వెళ్లేలా ఉన్నారు. ఎలాగూ బాక్సాఫీస్ వద్ద సరైన పోటీ లేదు. కౌంట్ సంగతి పక్కనపెడితే మొదటి రోజే చూడాలనే ఉత్సుకతను కొత్త రిలీజులు కలిగించలేక పోతున్నాయి. టాక్, రివ్యూలు వస్తే తప్ప జనం వెళ్ళరు. కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి అలాంటి సమస్య లేదు. ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం చూసిన మూవీ మళ్ళీ థియేటర్లో వచ్చే అవకాశం వస్తే వదులుతారా. ఇప్పట్లో మహేష్ ని స్క్రీన్ మీద చూసే అవకాశం లేకపోవడం, సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ ఎంజాయ్ చేస్తున్న వెంకీ ఫ్యాన్స్ ఆనందం రెండూ కలగలసి మార్చి 7 థియేటర్లలో ఓ రేంజ్ సందడి చేయడం ఖాయమే.