మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్సి 16 షూటింగ్ నిర్విరామంగా ముందు అనుకున్న ప్లానింగ్ ప్రకారమే జరిగిపోతోంది. విడుదల తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ వీలైనంత ఎక్కువ సమయం పోస్ట్ ప్రొడక్షన్ కు దొరికేలా చూసుకుంటున్నారు. రీ రికార్డింగ్ కోసం ఏఆర్ రెహమాన్ కు తగినంత సమయం ఇచ్చేలా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే క్రికెట్, కుస్తీకు సంబంధించిన కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరిగిపోయింది. ఈ వారంలోనే కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ జాయిన్ కాబోతున్నారని సమాచారం. ఆయన భాగాన్ని త్వరగా పూర్తి చేస్తారు.
ఇదిలా ఉండగా ఈ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన పలు ముఖ్యమైన ఎపిసోడ్లను ఢిల్లీలోని పార్లమెంట్ లో షూట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇంతకు ముందు అనుమతులు విరివిగా ఇచ్చేవాళ్ళు కానీ టెర్రరిస్టు దాడుల తర్వాత నిబంధనలు కఠినమయ్యాయి. అయితే కూటమి భాగస్వామిగా పవన్ కళ్యాణ్ వైపు రికమండేషన్ తీసుకుంటే బిజెపి ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది కాబట్టి దాదాపు ఫిక్సైనట్టేనని వినికిడి. అదే విధంగా దేశ రాజధానిలో ఉన్న జామా మసీద్ లోనూ కొన్ని సీన్లు తీయాలట. రంజాన్ మాసం అయిపోయాక దీనికి సంబంధించిన పర్మిషన్లు తెచ్చుకోబోతున్నారు.
ఢిల్లీ ఎప్పుడు వెళ్లాలనే దాని మీద ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూట్ కొనసాగుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఆర్సి 16కి పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అన్ని బాషలకు కనెక్ట్ అవుతుందా లేదానే మీమాంస టీంలో కొనసాగుతోంది. ఫ్యాన్స్ లో దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. గేమ్ ఛేంజర్ కోసం మూడేళ్ళ విలువైన కాలం వృథా కావడమే కాక డిజాస్టర్ మిగలడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే బుచ్చిబాబు ఆ కొరత తీరుస్తాడనే నమ్మకంతో ఉన్నారు. వీలైతే ఇదే ఏడాది దసరా లేదా దీపావళి కుదరకపోతే 2026 వేసవిని విడుదలకు టార్గెట్ గా పెట్టుకుంటున్నారు.