అర్జున్ రెడ్డి.. దాని రీమేక్ కబీర్ సింగ్.. ఇంకా యానిమల్.. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇప్పటిదాకా తీసిన మూడు సినిమాలూ ఒకదాన్ని మించి ఒకటి సక్సెస్ అయ్యాయి. సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఐతే ఈ విజయాలతో పాటు తీవ్ర విమర్శలూ ఎదుర్కొన్నాడు సందీప్ వంగ. తన సినిమాలను యువతను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ అనేకమంది విమర్శలు గుప్పించారు. అందులో ఇండస్ట్రీ జనాలు కూడా ఉండడం గమనార్హం. ‘యానిమల్’ సినిమా విషయంలో లెజెండరీ రైటర్ జావెద్ అక్తర్ సహా ఎంతోమంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వారికి సందీప్ ఘాటుగానే బదులిచ్చాడు. ఐతే ఈ సినిమాను మాజీ ఐఏఎస్ అధికారి వికాస్ దివ్యకీర్తి సైతం తప్పుబట్టారు. ‘ట్వల్త్ ఫెయిల్’ సినిమాలో యూపీఎస్సీ ప్రొఫెసర్గా కూడా నటించిన వికాస్.. ‘యానిమల్’ లాంటి సినిమాలు సమాజానికి మంచివి కావని అన్నారు. ఈ సినిమా సొసైటీని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లిందంటూ కొంచె గట్టిగానే విమర్శించారు వికాస్.
ఫిలిం సెలబ్రెటీలు తన సినిమాను తప్పుబట్టినపుడు ఘాటుగా బదులిచ్చిన సందీప్.. వికాస్ వ్యాఖ్యల విషయంలో మాత్రం కొంచెం సున్నితంగానే స్పందించాడు. ఆ వ్యాఖ్యలు తనను ఎంతో బాధించినట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలు చూశాకా.. తాను తప్పు చేశానా అని ఆలోచించినట్లు తెలిపాడు. అదే సమయంలో ఐఏఎస్ కావడం కంటే సినిమా తీయడం చాలా కష్టమని సందీప్ వ్యాఖ్యానించడం గమనార్హం.
‘‘యానిమల్ సినిమా గురించి ఆ మాజీ ఐఏఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలు నాకింకా గుర్తున్నాయి. ఇలాంటి సినిమాలు అస్సలు తీయకూడదన్నది ఆయన అభిప్రాయం. నా సినిమా సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లిందని కూడా అన్నారు. ఆ వ్యాఖ్యలు నిజంగా నన్నెంతో బాధించాయి. నేనేదో నేరం చేశాననిపించింది. కానీ ఆయన అనవసరంగా నా సినిమా గురించి విమర్శలు చేశారు. ఐఏఎస్ అధికారి కావాలంటే ఢిల్లీలో ఒక ఇన్స్టిట్యూట్లో చేరి కష్టపడి చదివితే చాలు. కానీ ఫిలిం మేకర్, లేదా రచయిత కావాలంటే ఎలాంటి కోర్సులు ఉండవు. టీచర్లు ఉండరు. అన్నీ నీకు నువ్వుగా నేర్చుకోవాలి. అభిరుచితో సాగాలి. కావాలంటే ఈ విషయాన్ని పేపర్ మీద రాసిస్తాను’’ అని సందీప్ వ్యాఖ్యానించాడు.