ఆర్థిక నేరాలకు పాల్పడి జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి సంచలనంగా మారాడు. ప్రతి సారి వివాదాలతో వార్తల్లో నిలిచే అతను, ఈసారి ఏకంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్కు లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. మస్క్ తనకు అభిమాన వ్యక్తి అని చెబుతూ, అతని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు లేఖలో పేర్కొన్నాడు.
ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుకేశ్, ‘ఎక్స్’ తనకు చాలా ప్రియమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని పేర్కొన్నాడు. మస్క్ను ‘నా మనిషి’ అంటూ సంబోధిస్తూ, అతని వ్యాపార శైలి తనకు బాగా నచ్చిందని చెప్పాడు. అంతేకాకుండా, తన కంపెనీ ఎల్ఎస్ హోల్డింగ్స్ ఇప్పటికే టెస్లా స్టాక్స్లో పెట్టుబడి పెట్టిందని, మంచి లాభాలు కూడా సాధించిందని వివరించాడు. ట్రంప్ ప్రభుత్వం కొత్తగా సృష్టించిన ‘డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ’ (డీఓజీఈ)కు మస్క్ నాయకత్వం వహించడాన్ని ప్రశంసించాడు.
ఇటీవలే తన ప్రియురాలు, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పుట్టినరోజు సందర్భంగా లేఖ రాసిన సుకేశ్, ఇప్పుడు మస్క్కు రాసిన లేఖలో ఆమె గురించి ప్రస్తావించటం గమనార్హం. జాక్వెలిన్ కూడా ‘ఎక్స్’ను ఎక్కువగా ఉపయోగిస్తుందని, అందుకే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై మరింత ఆసక్తి పెరిగిందని తెలిపాడు. సుకేశ్ చంద్రశేఖర్ జైలు నుంచే ఇలాంటి భారీ ఆఫర్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక తరచు సెటైర్స్ వేసే మస్క్ దీనిపై అసలు స్పందిస్తారా అనే విషయంలో ఉత్కంఠ పెరుగుతోంది. మొత్తానికి, మరోసారి సుకేశ్ తన లేఖతో వార్తల్లో నిలిచాడు.