కులం మీద కంటెంట్…సెన్సార్ చిక్కుల్లో సినిమా

మనోభావాలు సున్నితంగా మారిపోయిన ట్రెండ్ లో కులాల మీద సినిమాలు తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే సెన్సార్ చిక్కులు తప్పవు. యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి, సిద్దార్థ్ చతుర్వేది జంటగా నటిస్తున్న ధడక్ 2కి ప్రస్తుతం ఈ సమస్యే ఎదురైనట్టు బాలీవుడ్ టాక్. ముందు ప్లాన్ చేసుకున్న ప్రకారం ఈ మూవీ మార్చి 7 రిలీజ్ కావాలి. కానీ ఇప్పటిదాకా ప్రమోషన్లు జరగలేదు. ఇంకో వారం వాయిదా మార్చి 14 అనుకున్నా కనీసం ఆ డేట్ ని అఫీషియల్ గా ప్రకటించాలి. కానీ సెన్సార్ అభ్యంతరాల వల్లే ఆలస్యమవుతోందని సమాచారం. ఇదంతా మాములే కానీ ఆశ్చర్యపరిచే విషయాలు వేరే ఉన్నాయి.

ధడక్ 2 ఏడేళ్ల క్రితం తమిళంలో వచ్చినా సూపర్ హిట్ ‘పరియేరుమ్ పెరుమాళ్’కి రీమేకనేది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారం. వెనుకబడిన కులాల మీద సంధించిన అస్త్రంగా దాని గురించి అప్పట్లో విమర్శకులు చాలా ప్రశంసలు గుప్పించారు. మన నేటివిటీకి సూటయ్యేది కాకపోవడంతో డబ్బింగ్, రీమేక్ రెండూ తెలుగులో జరగలేదు. కానీ హిందీ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కొన్ని కీలక మార్పులు చేశారట. అయితే అవి చాలా బోల్డ్ గా, ఇంకా చెప్పాలంటే కొన్ని వర్గాల మధ్య అలజడులు రేపే విధంగా ఉన్నాయని భావించి ఏ కట్స్ ఇవ్వాలనే దాని మీద సెన్సార్ అధికారులు చర్చలు జరుపుతున్నట్టు వినికిడి.

ఈ లెక్కన ఏ స్థాయిలో దర్శకురాలు షాజియా ఇక్బాల్ ఈ సినిమాని తెరకెక్కించారో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఒరిజినల్ వెర్షన్ లో ఉన్నది చాలా మంచి లైన్. అడల్ట్ సీన్స్, బూతు డైలాగులు ఉండవు. ఆలోచింపజేసే సీరియస్ అంశాలు జొప్పించారు. మరి ధడక్ 2లో ఏమేం పెట్టారనేది ఆసక్తికరంగా మారింది. దఢక్ ద్వారానే జాన్వీ కపూర్ డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. మరాఠా బ్లాక్ బస్టర్ సైరాత్ రీమేక్ గా రూపొందిన ఆ సినిమా కూడా కులాంతర ప్రేమ మీదే సాగుతూ క్లైమాక్స్ ట్రాజెడీగా ముగుస్తుంది. మరి దఢక్ 2లో కూడా అలాంటివి ఏమైనా ప్లాన్ చేశారో ఏమో కానీ కనీసం ట్రైలర్ వచ్చాకే ఒక అంచనాకు రావొచ్చు.