సినీ రంగంలో చాలామంది చిన్న చిన్న సాయాలు చేసి పెద్ద స్థాయిలో పబ్లిసిటీ చేసుకునేవాళ్లే. కానీ కొందరు మాత్రం సైలెంటుగా సేవా కార్యక్రమాలు చేస్తూ వాటి గురించి బయటికి చెప్పుకోరు. అలాంటి వాళ్లలో ప్రభాస్ ఒకరని అంటారు. ఏదైనా ప్రకృతి విపత్తులు తలెత్తినపుడు, వేరే సందర్భాల్లో ప్రభాస్ ఎలా స్పందిస్తాడో తెలిసిందే. విరాళాలు ప్రకటించడంలో ముందుంటాడు. పైగా పెద్ద మొత్తంలో సాయాలు అందిస్తాడు. అవి కాక ప్రభాస్ పబ్లిసిటీకి దూరంగా సేవా కార్యక్రమాలు చేయడం, తనకు తెలిసిన వాళ్లెవరైనా ఇబ్బందుల్లో ఉంటే సాయాలు అందించడం లాంటివి చేస్తుంటాడని సన్నిహితులు చెబుతుంటారు.
అలా ప్రభాస్ చేసిన ఓ ముఖ్యమైన సాయం గురించి రైటర్ తోట ప్రసాద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం అతడిది ఎంత పెద్ద మనసో తెలియజేస్తోంది. 2010లో ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు చనిపోయిన సంగతి తెలిసిందే. తండ్రి మరణం ఎవరికైనా ఎంతో దు:ఖాన్ని కలిగిస్తుంది. ప్రభాస్ కూడా ఆ సమయంలో తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. అలాంటి టైంలో కూడా తాను అనారోగ్యం పాలై ఆసుపత్రిలో ఉంటే.. ఆ విషయం తెలుసుకుని వైద్య ఖర్చుల కోసం సొంత డబ్బులు పంపించాడని తోట ప్రసాద్ గుర్తు చేసుకున్నారు.
తండ్రి మరణిస్తే ఎవ్వరైనా తీవ్రమైన దు:ఖంలో ఉంటారని.. అలాంటి సమయంలో వేరే విషయాలేవీ పట్టించుకోరని.. కానీ ప్రభాస్ మాత్రం తన సినిమాకు రచయితగా పని చేశాననే కారణంతో తన ట్రీట్మెంట్ కోసం ఒక వ్యక్తి ద్వారా డబ్బులు పంపించి ఆదుకున్నాడని ప్రసాద్ తెలిపారు. తాను అప్పటికి ‘బిల్లా’ సినిమా కోసం పని చేశానని.. కాగా ఇన్నేళ్లకు మళ్లీ ప్రభాస్ నటించిన ‘కన్నప్ప’ చిత్రానికి రచయితగా వర్క్ చేయడం ఆనందంగా ఉందని తోట ప్రసాద్ అన్నారు. మంచు విష్ణు లీడ్ రోల్ చేసిన ‘కన్నప్ప’లో ప్రభాస్ రుద్ర అనే ప్రత్యేక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.