కీరవాణి కొత్త ట్రెండ్ సృష్టిస్తారా

తెలుగు రాష్ట్రాల్లో సంగీత దర్శకులు నిర్వహించే మ్యూజిక్ కన్సర్టులు తక్కువ. ఇళయరాజా రెండుసార్లు హైదరాబాద్ లో చేస్తే భారీ స్థాయిలో స్పందన రాలేదు. ఏఆర్ రెహమాన్ నిర్వహిస్తే మళ్ళీ ఇంకోసారి చేయాలనే స్థాయిలో రెస్పాన్స్ కనిపించలేదు. జనం వచ్చారు కానీ జోష్ తగ్గినట్టనిపించేది. దేవిశ్రీ ప్రసాద్ గత అక్టోబర్ లో నిర్వహించింది ఒక రకంగా హిట్టేనని చెప్పాలి. కానీ తమిళనాడులో అలా కాదు. రెగ్యులర్ గా లైవ్ షోలు జరుగుతూనే ఉంటాయి. రాజా, రెహమాన్ తో పాటు హరీస్ జైరాజ్, దేవా, యువన్ శంకర్ రాజా తదితరులు చెన్నైతో పాటు కోయంబత్తూర్ లాంటి ఇతర నగరాల్లోనూ సంగీత ప్రదర్శనలు జరిపారు.

వీటిలో చాలా మటుకు భారీగా జనాలను ఆకట్టుకున్నవి. వచ్చే నెల మార్చి 22 ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి హైదరాబాద్ లో మై టూర్ ఎంఎంకె పేరుతో లైవ్ కన్సర్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన టికెట్ల అమ్మకాలు ఆన్ లైన్ లో మొదలైపోయాయి. గత ఇరవై సంవత్సరాల్లో భాగ్య నగరంలో నేను చేయబోతున్న లైవ్ ఈవెంట్ ఇదేనని కీరవాణి చెబుతున్నారు. ఆయన డిస్కోగ్రఫీ ఎంత గొప్పదో మ్యూజిక్ లవర్స్ కి బాగా తెలుసు. తొంబై దశకంలో వచ్చిన అల్లరి ప్రియుడు, ఘరానా మొగుడు, అన్నమయ్యతో మొదలుపెట్టి నిన్నా మొన్నటి బాహుబలి, ఆర్ఆర్ఆర్ దాకా ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ఎన్నో ఉన్నాయి.

కొన్ని వందల పాటలు ఛార్ట్ బస్టర్స్ గా నిలిచిపోయాయి. ప్లే లిస్టులో మ్రోగుతూనే ఉంటాయి. మరి ఇంత లేట్ వయసులో కీరవాణి చేయబోయే ఈ విభావరి కనక బ్లాక్ బస్టర్ అయితే భవిష్యత్తులో మరిన్ని జరగడానికి దోహదం చేస్తుంది. థియేటర్లలో మన ఆడియన్స్ పాటలను ఎంజాయ్ చేసినట్టుగా ఓపెన్ గ్రౌండ్స్ లో చూసేందుకు అంతగా ఇష్టపడరు. దీన్ని బ్రేక్ చేయాలంటే పదే పదే ఈవెంట్లు జరుగుతూ ఉంటాలి. హుషారు గొలిపే పాటలతో శ్రోతలను మైమరిపింపజేయాలి. వందలాది గాయని గాయకులు, ఆర్కెస్ట్రా ఇందులో భాగం కాబోతున్నారు. యుస్, ఆస్ట్రేలియాలోనూ ఈ షోలు నిర్వహిస్తారు.