దిల్ రాజుకి భలే కలిసొస్తున్నాయ్

నిర్మాత దిల్ రాజుకి 2025 మంచి బోణీ ఇచ్చేసింది. గేమ్ ఛేంజర్ నిరాశ పరిచినా జీ స్టూడియోస్ భాగస్వామ్యం వల్ల దానికాయన సోలో ప్రొడ్యూసర్ కాదు కాబట్టి నష్టాల తీవ్రత అంతో ఇంతో తగ్గిందనే చెప్పాలి. కానీ సంక్రాంతికి వస్తున్నాం ఊహించిన దానికన్నా భారీ స్థాయిలో మూడు వందల కోట్లు కొల్లగొట్టడం ఎస్విసి బ్యానర్ ని ఒక్కసారిగా రేసులోకి తెచ్చింది. దీనికి తోడు పండక్కు వచ్చిన రెండో హిట్టు డాకు మహారాజ్ నైజాం పంపిణి ఆయనే చేయడంతో రెవిన్యూ మరింత తోడయ్యింది. అన్నీ మంచి శకునములే అన్నట్టు మార్చి 7 ప్లాన్ చేసిన రీ రిలీజ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇంకో జాక్ పాట్ ఇచ్చేలా ఉంది.

ఎందుకో చూద్దాం. మహేష్ బాబు ఫ్యాన్స్ మంచి ఆకలి మీదున్నారు. గుంటూరు కారం తర్వాత బాగా గ్యాప్ వచ్చేసింది. గత ఏడాది మురారిని ఎంజాయ్ చేశాక జనవరి ప్రారంభంలో అతిథి వస్తుందని ప్రచారం జరిగి దాని కోసం ఎదురు చూశారు. కానీ అదేమో వాయిదా పడింది. ఖలేజా ఇప్పట్లో రాదని తేలిపోయింది. దీంతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుని భారీ స్థాయిలో సెలెబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ముఫాసా లయన్ కింగ్ కి మహేష్ కేవలం డబ్బింగ్ చెప్పినందుకే అంత హంగామా చేసినోళ్లు ఇప్పుడు ఇంత హిట్టు సినిమాకి హడావిడి చేయకుండా ఊరుకుంటారా. ఇంకో విషయముంది.

వెంకటేష్ అభిమానులు సైతం ఫుల్ జోష్ లో ఉన్నారు. సీనియర్ స్టార్లలో నెంబర్ వన్ గ్రాసర్ అందించిన ఆనందం ఇంకా పచ్చిగా ఉండగానే పెద్దోడు థియేటర్లకు వస్తున్నాడు. సో మహేష్ బ్యాచ్ తో కలిసి రచ్చ చేసేందుకు ఇప్పటి నుంచే ప్లానింగ్ లో ఉన్నారట. వీళ్లిద్దరూ తోడైతే మురారి రికార్డులకు కాలం చెల్లినట్టే. పైగా మార్చి మొదటి వారంలో చెప్పుకోదగ్గ కొత్త సినిమాలేం లేవు. సో థియేటర్లు సరిపడా దొరుకుతాయి. మార్చి 14 నాని నిర్మించిన కోర్ట్ వచ్చేదాకా అదే పరిస్థితి. సో ఫ్యామిలీస్ సిరిమల్లె చెట్టుకే ఓటేయొచ్చు. సోషల్ మీడియాలో ఇప్పటి నుంచే ఫోటోలు, మీమ్స్, వీడియోలతో ఫ్యాన్స్ ట్రెండింగ్ మొదలుపెట్టేశారు.