హీరోలుగా ఫ్లాప్… విలన్లుగా తోప్

స్టార్ హీరోల వారసులు ఇద్దరూ. పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో ప్రేక్షకుల నుంచి ఘనస్వాగతం లభించింది. కాని దాన్ని నిలబెట్టుకోవడం ఎంత పెద్ద సవాలో కాలం గడిచేకొద్దీ అర్థమయ్యింది. కానీ తెలుసుకునే లోపు కెరీర్ మారిపోయింది. అదేంటో మీరే చూడండి. ధర్మేంద్ర రెండో వారసుడిగా బాబీ డియోల్ 1995లో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. డెబ్యూ మూవీ బర్సాత్ బాగానే ఆడింది. పాటలు ఛార్ట్ బస్టర్. తర్వాత గుప్త్ రికార్డులు బద్దలు కొట్టింది. సోల్జర్ కమర్షియల్ గా సూపర్ హిట్. బిచ్చు, హంరాజ్ లాంటివి డబ్బులు తెచ్చాయి. కానీ పదేళ్లు తిరక్కుండానే వరస ఫ్లాపులతో బాబీ డియోల్ ఎక్కువ కాలం కథానాయకుడిగా నిలవలేకపోయాడు.

2010 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో అప్పుడప్పుడు కనిపించినా ఆఫర్లు ఇచ్చేవాళ్ళు కరువయ్యారు. ఆశ్రమ్ లాంటి వెబ్ సిరీస్ లు హిట్టయినా సినిమాలు రాలేదు. అప్పుడు వచ్చి కలిసిన సందీప్ రెడ్డి వంగా యానిమల్ రూపంలో బాబీ డియోల్ కెరీర్ నే మార్చేశాడు. కోటి ఇస్తే ఎక్కువనుకునే రేంజ్ నుంచి అయిదు నుంచి పది కోట్ల మధ్య ఎంత డిమాండ్ చేసినా నిర్మాతలు ఇచ్చే స్థాయికి చేర్చాడు. సౌత్ లో సూర్య, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, విజయ్ లాంటి స్టార్ల సినిమాల్లో విలన్ గా చేసేశాడు. తనకు ఒక తెలుగువాడు బ్రేక్ ఇవ్వడం గురించి బాబీ డియోల్ ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటాడు.

ఇక అక్షయ్ ఖన్నాది ఇంచుమించు ఇదే కథ. వినోద్ ఖన్నా లెగసిని కొనసాగించాలని 1997లో హిమాలయ్ పుత్రతో తెరంగేట్రం చేస్తే రెండో సినిమా బోర్డర్ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. తాళ్ మర్చిపోలేని గొప్ప విజయాన్ని ఇచ్చింది. దిల్ చాహతా హై, హంరాజ్, హంగామా, రేస్, హల్చల్ లాంటివి బాగానే ఆడాయి. కానీ బాబీ లాగే తక్కువ టైంలో అక్షయ్ డౌన్ ఫాల్ అయ్యాడు. 2005 తర్వాత కనిపించడం తగ్గించాడు. కట్ చేస్తే చావాలో ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా జీవించిన తీరు మళ్ళీ కెరీర్ కి జీవం పోసింది. అవకాశాలు వరదలా క్యూ కడుతున్నాయి. హీరోగా అందుకోలేని ఎత్తులు ఈ ఇద్దరు విలన్లుగా చేరుకోవడం విశేషం.