కాంతార హీరోని టార్గెట్ చేయడం ఏమిటి

కేవలం పదహారు కోట్ల బడ్జెట్ తో కాంతార తీసి మూడు వందల కోట్లు వసూలు చేసే బ్లాక్ బస్టర్ ఇచ్చాకే రిషబ్ శెట్టి అంటే ఏంటో ప్రపంచానికి తెలిసి వచ్చింది. కన్నడలో హిట్టయితే ఏదో అనుకోవచ్చు కానీ రెండు వారాల తర్వాత ఇతర భాషల్లో డబ్బింగ్ వెర్షన్లు రిలీజైతే అక్కడ కూడా ఘనవిజయం సాధించడం మాములు చరిత్ర కాదు. అందుకే కాంతార కొనసాగింపు చాప్టర్ 1 పేరుతో మరింత భారీగా తీస్తున్న రిషబ్ శెట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో చావా పుణ్యమాని హాట్ టాపిక్ గా మారాడు. కారణం 2027లో రిలీజ్ కాబోయే ఛత్రపతి శివాజీలో మరాఠా వీరుడిగా టైటిల్ రోల్ పోషిస్తున్నాడు కాబట్టి.

నిజానికి దీని షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అందుకే రెండేళ్ల తర్వాత రిలీజ్ డేట్ పెట్టుకున్నారు. కానీ కొందరు యాంటీ ఫ్యాన్స్ శివాజీ పాత్రకు రిషబ్ శెట్టి సూటవ్వడని, ప్రభాస్ లేదా రామ్ చరణ్ అయితే బాగుంటుందని ఏఐ టెక్నాలజీ వాడి ఫోటోలు వదలడం మొదలుపెట్టారు. అసలు మొదలే కానీ సినిమా మీద ఇలాంటి ప్రచారం జరగడం చూసి కన్నడ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. శివాజీ రూపం కన్నా ఆయన పరాక్రమం, వీరత్వాన్ని తెరమీద పండించే నటుడు అవసరమని, అది రిషబ్ లో పుష్కలంగా ఉందనేది వాళ్ళ వాదన. ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది పక్కనపెడితే ఈ డిబేట్లు ఆగడం లేదు.

చావా పుణ్యమాని శంభాజీ,శివాజీ గురించి తెలుసుకుంటున్న యూత్ పెరిగిపోతోంది. వాళ్ళ గురించి ఆన్ లైన్ లో చదివి అవగాహన తెచ్చుకుంటున్నారు. చిన్నప్పుడు స్కూల్ పుస్తకాల్లో అక్బర్, షాజహాన్, బాబర్, టిప్పు సుల్తాన్ లను ఎక్కువ హైలైట్ చేశారు తప్పించి శివాజీ లాంటి వీరుల పాఠాలు ఎందుకు లేవని నిలదీస్తున్నారు. ఏది ఏమైనా చావా వల్ల ప్యాన్ ఇండియా సినిమాల్లో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్స్ కు ప్రాధాన్యం పెరగనుంది. బాజీరావు మస్తానీ, జోధా అక్బర్ లాంటి సూపర్ హిట్లు చూపించలేని ప్రభావం చావా సాధించింది. ఇది ఎక్కడ దాకా వెళ్తుందో ఎక్కడ ఆగుతుందో సమాధానం చెప్పాల్సింది కాలమే.