నర్తనశాల చూసేందుకు ఎంత పెట్టాలి?

నందమూరి బాలకృష్ణ రెండు రోజుల కిందట పెద్ద సర్‌ప్రైజే ఇచ్చారు. దాదాపు రెండు దశాబ్దాల కిందట తన తండ్రి ఎన్టీ రామారావు నటించిన లెజెండరీ మూవీ ‘నర్తనశాల’ను రీమేక్ చేయడానికి సంకల్పించిన సంగతి తెలిసిందే. సౌందర్య ద్రౌపది పాత్రలో నటించిన ఈ సినిమా కోసం కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. అంతలో సౌందర్య చనిపోవడంతో ఈ సినిమాను బాలయ్య ఆపేశాడు. ఈ సినిమాను ఆ తర్వాత పున:ప్రారంభించలేదు.

ఐతే అప్పుడు చిత్రీకరించిన సన్నివేశాలన్నింటినీ ఎడిట్ చేసి ఒక కొలిక్కి తీస్తే 17 నిమిషాల నిడివి తేలింది. ఇప్పుడు దాన్ని ఒక మినీ మూవీగా ప్రేక్షకుల ముందుకు తేవాలని బాలయ్య సంకల్పించాడు. శ్రేయాస్ ఏటీటీ ద్వారా దసరా కానుకగా ఈ నెల 24న బాలయ్య ‘నర్తనశాల’ విడుదల కాబోతోంది.

ఈ షార్ట్ మూవీని చూసేందుకు ప్రేక్షకులు టికెట్ కొనాల్సి ఉంటుందని, తద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగం ఛారిటీకి ఉపయోగిస్తామని బాలయ్య ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే 17 నిమిషాల నిడివి చూసేందుకు మరీ ఎక్కువ రేటు పెట్టడం సమంజసం కాదని బాలయ్య భావించినట్లున్నాడు. అందుకే ఈ ధరను రూ.50కి పరిమితం చేశాడు. ఈ రేటుతోనే ముందే టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.

ఇలా ఏటీటీలో సినిమాలు రిలీజ్ చేసే ఒరవడికి శ్రీకారం చుట్టిన రామ్ గోపాల్ వర్మ.. తన సినిమాలకు రూ.100, 150, 200 చొప్పున వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఆయనేమీ రెండు రెండున్నర గంటల్లో ఫీచర్ పిలిమ్స్ తీయలేదు. అరగంట లోపు నిడివే అలా డబ్బులు వసూలు చేశారు. దాంతో పోలిస్తే బాలయ్య ఉదారంగా వ్యవహరించినట్లే. ఐతే ఇలా ఏటీటీలో రిలీజైన కంటెంట్ ఈజీగా పైరేట్ అయి ఇంటర్నెట్లోకి వచ్చేస్తున్న నేపథ్యంలో బాలయ్య ‘నర్తనశాల’ను ఎంతమంది డబ్బులు పెట్టి చూస్తారన్నది ఆసక్తికరం.