బాహుబలి పాన్ జాతీయ స్థాయిలో సంచలనం రేపాక.. ‘పాన్ ఇండియా’ సినిమాల ఒరవడి బాగా పెరిగింది. ఐతే పాన్ ఇండియా పేరుతో బోలెడన్ని సినిమాలు వస్తున్నాయి కానీ.. వాటిలో నిజంగా దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నవి ఎన్ని అంటే వేళ్ల మీదే లెక్కపెట్టాలి. భారీ చిత్రాలను పక్కన పెడితే.. మిడ్ రేంజ్ మూవీస్లో కాంతార, కార్తికేయ-2, హనుమాన్ లాంటి కొన్ని చిత్రాలు మాత్రమే పాన్ ఇండియా స్థాయిలో ప్రభావం చూపాయి. విజయం సాధించాయి.
తెలుగు నుంచి పాన్ ఇండియా చిత్రాలుగా ప్రచారంలోకి వచ్చి.. చివరికి తెలుగు రాష్ట్రాల అవతల ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన సినిమాల జాబితా పెద్దదే. అందులోకి తాజాగా ‘తండేల్’ కూడా వచ్చి చేరింది. దీన్ని కూడా పాన్ ఇండియా చిత్రంగానే మొదలుపెట్టారు. అలాగే ప్రమోట్ చేశారు. రిలీజ్ ముంగిట కూడా ముంబయి, చెన్నై సిటీల్లో ప్రమోషనల్ ఈవెంట్లు కూడా చేశారు. కానీ ప్రభావం మాత్రం ఏమీ కనిపించడం లేదు.
‘తండేల్’ తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. వీకెండ్ తర్వాత కూడా బలంగా నిలబడుతోంది. కానీ తెలుగు రాష్ట్రాల అవతల మాత్రం ‘తండేల్’ ప్రేక్షకుల దృష్టిని పెద్దగా ఆకర్షించలేకపోతోంది. తెలుగు సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చే కర్ణాటకలో సినిమా పర్వాలేదనిపిస్తోంది. అక్కడ రిలీజైంది కూడా తెలుగు వెర్షనే. తమిళంలో సాయిపల్లవికి మంచి ఫాలోయింగ్ ఉన్నా, కోలీవుడ్ నటుడు కరుణాకరన్ ఓ కీలక పాత్ర చేసినా, దేవిశ్రీ కూడా అక్కడి వారికి సుపరిచితుడే అయినా.. ‘తండేల్’కు చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ రాలేదు.
హిందీలో అయితే సినిమాను మొక్కుబడిగా రిలీజ్ చేశారు. వసూళ్లు కూడా నామమాత్రంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. మలయాళంలో అయితే ‘తండేల్’ను రిలీజే చేయలేదు. కేరళలోని తెలుగు వారి కోసం మల్టీప్లెక్సుల్లో కొన్ని షోలు కేటాయించారంతే. మొత్తంగా చూస్తే ‘తండేల్’ పేరుకే పాన్ ఇండియా మూవీ. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలకే పరిమితం అని చెప్పాలి.