సౌత్ బెస్ట్ వెబ్ సిరీస్… సీక్వెల్ వస్తోంది

ఇప్పుడు సినిమాల్లో క్వాలిటీ కంటెంట్, భారీతనం, బిజినెస్, కలెక్షన్స్.. ఈ కోణంలో చూస్తే బాలీవుడ్ మీద సౌత్ సినిమానే స్పష్టమైన ఆధిక్యం సాధిస్తున్న మాట వాస్తవం. ఒకప్పుడు బాలీవుడ్ ముందు చిన్నవిగా కనిపించిన సౌత్ ఫిలిం ఇండస్ట్రీస్ దాన్ని దాటి ముందుకు వెళ్లిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమా రేంజే మారిపోయింది.

ఐతే వెబ్ సిరీస్‌ల విషయానికి వస్తే మాత్రం బాలీవుడ్‌దే ఆధిపత్యం అనడంలో సందేహం లేదు. ఫ్యామిలీ మ్యాన్ సహా ఎన్నో టాప్ వెబ్ సిరీస్‌లు వచ్చాయి బాలీవుడ్ నుంచి. సౌత్ ఇండస్ట్రీ వెబ్ కంటెంట్ మీద పెద్దగా దృష్టిసారించకపోవడంతో ఇంకా అందులో కంటెంట్ స్థాయి పెరగట్లేదు. కానీ కొన్ని ఒరిజినల్స్ మాత్రం బాలీవుడ్‌కు దీటుగా నిలిచాయి. విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు ప్రేక్షకాదరణనూ దక్కించుకున్నాయి.

అలాంటి సిరీస్‌ల్లో ముందు వరుసలో నిలుస్తుంది.. సుడల్. ‘విక్రమ్ వేద’ దర్శకులు పుష్కర్-గాయత్రి అమేజాన్ కోసం క్రియేట్ చేసిన సిరీస్ ఇది. 2022లో రిలీజైన ఈ తమిళ సిరీస్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. కంటెంట్ పరంగా సౌత్ నుంచి వచ్చిన బెస్ట్ సిరీస్ ఇదని చెప్పొచ్చు. ఇండియాలో మోస్ట్ వ్యూడ్ ఒరిజినల్స్‌లోనూ ఒకటిగా నిలిచింది. ఇప్పుడీ సిరీస్‌కు రెండో సీజన్ రెడీ అయింది.

ఈ నెల 28 నుంచి ఇది ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. పుష్కర్-గాయత్రిలే దీన్నీ క్రియేట్ చేశారు. తొలి సీజన్లో ముఖ్య పాత్రలు పోషించిన ఐశ్వర్యా రాజేష్-కదిర్ ఇందులోనూ లీడ్ రోల్స్ చేశారు. శ్రియా రెడ్డి కూడా ఇందులో కొనసాగనుంది. షాకింగ్ ట్విస్టులు, ఉత్కంఠభరిత కథనంతో తొలి సీజన్ ఉర్రూతలూగించగా.. రెండో సీజన్ కూడా అలాగే ప్రేక్షకులను అలరిస్తుందేమో చూడాలి.