మహేషే కాదు తారక్ కూడా అడవుల్లోకే

ఒక్క అప్డేట్ బయటికి తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఎస్ఎస్ఎంబి 29 అడవుల బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబుని ఇప్పటిదాకా చూడని టెర్రిఫిక్ పాత్రలో దర్శకుడు రాజమౌళి ప్రెజెంట్ చేయబోతున్నారనే టాక్ అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తోంది. ప్రియాంకా చోప్రా ఒకటే కన్ఫర్మ్ గా తెలిసిన క్యాస్టింగ్ కాగా పృథ్వి రాజ్ సుకుమారన్, నానా పాటేకర్, జాన్ అబ్రహం తదితరుల పేర్లు గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. అయితే జక్కన్న ఇప్పట్లో వీటికి సంబంధించి ఎలాంటి సమాచారం అధికారికంగా ఇచ్చేందుకు రెడీగా లేరు.

ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కబోయే యాక్షన్ ఎంటర్ టైనర్ లోనూ అడవి నేపథ్యం ఉంటుందని సమాచారం. తొలుత ఆ సన్నివేశాలనే వికారాబాద్ పరిసరాల్లో తారక్ లేకుండా షూట్ చేయబోతున్నట్టు తెలిసింది. వార్ 2 బ్రేక్ తీసుకున్నాక తారక్ వచ్చి జాయిన్ కాబోతున్నాడు. ఇప్పటిదాకా నీల్ తన ఉగ్రం, కెజిఎఫ్, కెజిఎఫ్ 2 లో ఎక్కడ చెట్లు పుట్టలను చూపించలేదు. వేరే ప్రపంచాల్లోకి తీసుకెళ్లిపోయాడు. కానీ జూనియర్ మూవీ అలా ఉండదట. కమర్షియల్ జానరే అయినప్పటికీ హీరోయిజంని పీక్స్ లో చూపించే సరికొత్త బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నట్టు సమాచారం.

దీనికి డ్రాగన్ టైటిల్ ముందు నుంచి ప్రచారంలో ఉంది. అయితే తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ఇదే పేరుతో చేసిన సినిమా ఫిబ్రవరి 21 విడుదల కానుంది. టాలీవుడ్ డబ్బింగ్ వెర్షన్ కు రిటర్న్ అఫ్ ది డ్రాగన్ అని పెట్టడం గమనార్హం. ఎన్టీఆర్ నీల్ నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్సే తెలుగులో ప్రదీప్ మూవీని తీసుకొస్తుండటం గమనార్హం. అంటే ఫలితం చూశాక డ్రాగన్ టైటిల్ పెట్టుకోవాలో వద్దో నిర్ణయిస్తారేమో. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న తారక్ నీల్ చిత్రంలో టోవినో థామస్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తుండగా 2026 సంక్రాంతి విడుదలని లక్ష్యంగా పెట్టుకున్నారు.