నిన్న ‘పుష్ప-2’ సక్సెస్ మీట్లో చాలామంది ప్రసంగాలు చేశారు. అందులో సుకుమార్ స్పీచే హైలైట్గా నిలిచింది. ఎవరో పెద్దగాయన్న అన్నారంటూ అల్లు అర్జున్ను ఎస్వీ రంగారావుతో పోల్చడం దగ్గర్నుంచి సుకుమార్ మాట్లాడిన చాలా మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఐతే మిగతా కామెంట్స్ అన్నీ ఒకెత్తయితే..
కొన్నేళ్ల నుంచి తన సక్సెస్లు అన్నీ మైత్రీ మూవీస్ పుణ్యమే అంటూ ఆయన చేసిన కామెంట్స్ మరో ఎత్తు. ప్రతి దర్శకుడూ హిట్ కొడితే నిర్మాతలను కొనియాడడం, వాళ్లకు క్రెడిట్ ఇవ్వడం మామూలే కానీ.. ఇక్కడ సుకుమార్ తెచ్చిన ఒక పోలిక అందరి దృష్టినీ ఆకర్షించింది. పరీక్ష మళ్లీ రాయిస్తే ఎవరైనా ఫెయిలవుతారా అంటూ ఆయన వ్యాఖ్యానించడం విశేషం.
‘రంగస్థలం’ దగ్గర్నుంచి తన చిత్రాలన్నీ పెద్ద హిట్లు అవుతున్నాయంటే అందుకు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తనకు ఇస్తున్న కంఫర్టే కారణమని సుకుమార్ తెలిపాడు. ఒకసారి పరీక్ష రాసి ఫెయిలైన విద్యార్థికి మళ్లీ ఎగ్జామ్ రాసే అవకాశం ఇస్తే పాసవుతాడు కదా.. అలాగే తనకు కూడా రీరైట్ చేసే అవకాశం మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు ఇస్తారని సుకుమార్ చెప్పాడు.
ఒక సీన్ తీసి అది బాలేదంటే మళ్లీ తీసే ఛాన్స్ మైత్రీలో ఉంటుందని.. ఒక సన్నివేశాన్ని మూణ్నాలుగుసార్లు కూడా రీషూట్ చేసిన సందర్భాలు బోలెడు ఉన్నాయని సుకుమార్ తెలిపాడు. కానీ ఇలా ఎన్నిసార్లు చేసినా మైత్రీ అధినేతలు ఒక్క మాట కూడా అనరని.. ఎంత ఖర్చయినా, ఎంత ఆలస్యం అయినా పట్గించుకోరని.. కాబట్టే తన సక్సెస్ క్రెడిట్ అంతా వారిదే అని సుకుమార్ అన్నాడు.
ఇదే కంఫర్ట్ ఆ సంస్థలోని దర్శకులందరికీ ఉంటుందని అనుకుంటున్నట్లు సుకుమార్ చెప్పగా.. కింద ఉన్న మైత్రీ అధినేతలు రవిశంకర్, నవీన్ అది నిజమే అని చెప్పారు. సుకుమార్ సరదాగా ఈ మాటలు అన్నా.. అందులో రవ్వంత కూడా ఎగ్జాజరేషన్ లేదన్నది రంగస్థలం, పుష్ప, పుష్ప-2 సినిమాలకు పని చేసిన యూనిట్ సభ్యులు చెబుతున్న మాట. దేనికీ ఒక పట్టాన సంతృప్తి చెందని సుకుమార్ ఈ సినిమాల్లో రీషూట్లు చేసిన సన్నివేశాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయని..
దీని వల్ల వర్కింగ్ డేస్తో పాటు బడ్జెట్ కూడా చాలా పెరిగిందని.. మైత్రీ అధినేతలు ఎంత ఇబ్బంది పడ్డా సుకుమార్ను ఒక మాట అనకుండా, ఆయన ఏం అడిగితే అది సమకూరుస్తూ బెస్ట్ ఔట్ పుట్ రావడానికి కారణమయ్యారని.. సుకుమార్ సక్సెస్లో కచ్చితంగా మైత్రీ అధినేతలకు క్రెడిట్ ఇవ్వాల్సిందే అని యూనిట్ వర్గాలు అంటున్నాయి.