బాస్ ఈజ్ బాస్ : విశ్వక్ సేన్

వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే. మాములుగా విశ్వక్ సేన్ ఈవెంట్లకు నందమూరి హీరోలు రావడం పరిపాటి. దాన్ని విశ్వక్ ఎప్పుడూ దాచలేదు. బహిరంగంగానే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మీద తన అభిమానాన్ని చాటుతూనే ఉంటాడు.

డాకు మహారాజ్ సక్సెస్ పార్టీలో ముందు కనిపించింది విశ్వకే. ఈ నేపథ్యంలో చిరుని లైలా వేడుకకు పిలవడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచింది. అయితే నిర్మాత సాహు గారపాటితో అనిల్ రావిపూడి సినిమా చేయనున్న మెగాస్టార్ ఆ కారణంగా దీనికి రావడమనేది సర్ప్రైజ్ కాకపోవచ్చు.

కానీ విశ్వక్ సేన్ కు దీనికి సంబంధించిన ప్రశ్న ఎదురయ్యింది. మెగా కాంపౌండ్ లోకి వెళ్లడం గురించి ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించగా మా ఇంటికి ఉన్న కాంపౌండ్ తప్ప వేరేవి తనకు తెలియదని, అయినా ఇండస్ట్రీ మొత్తం ఒకే కుటుంబంగా భావిస్తున్నప్పుడు మీరు లేనిపోనివి సృష్టించకండని చురక వేశాడు.

తన తండ్రికి రాజకీయాల పరంగా చిరంజీవి గారితో ప్రజారాజ్యం టైంలో పరిచయముందని, ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. వ్యక్తిగత ఇష్టం ఎవరి మీదున్నా బాస్ ఈజ్ బాస్ అంటూ విశ్వక్ సేన్ ఓపెన్ స్టేట్ మెంట్ ఇవ్వడం మెగా ఫ్యాన్స్ నుంచి లైలాకు మద్దతు దొరికేలా చేయొచ్చు.

అయినా చిరంజీవి, బాలకృష్ణ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ చాలా సందర్భాల్లో వాళ్లే చెప్పుకున్నారు. కానీ బయట మాత్రం అభిమానులు లేదా నెటిజెన్లు వైరుధ్య భావాలను ప్రదర్శించుకుంటూ ట్రోలింగ్ కు దిగడం విచిత్రం. విశ్వక్ సేన్ కున్న క్లారిటీ వాళ్లకూ ఉంటే మంచిదే.

ఆడవేషంలో ఒక యూత్ హీరో సినిమా చేయడం ఈ మధ్యకాలంలో లైలాతోనే జరిగింది. చిరంజీవి వచ్చి ఏం మాట్లాడతారనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో రామ్ చరణ్ ఓరి దేవుడా ఈవెంట్ కు గెస్టుగా విచ్చేయగా రెండు సంవత్సరాల తర్వాత చిరంజీవి అదే హీరో లైలాకు విచ్చేయడం విశేషం.