పవన్ కళ్యాణ్ సినిమాలకు ప్రాధాన్యం తగ్గించేసి చాలా కాలం అయింది. 2019 ఎన్నికలకు ముందు సినిమాలకు గుడ్ బై చెప్పేయాలని నిర్ణయించుకున్న ఆయన.. రెండేళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చాడు కానీ.. ముందులా సినిమాలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వట్లేదు. పార్టీ నడపడం కోసం డబ్బులు అవసరమై చకచకా కొన్ని రీమేక్ సినిమాలు చేశారు. వేరే సినిమాలకు కమిట్మెంట్లు ఇచ్చి అడ్వాన్సులు కూడా తీసుకున్నారు.
కానీ ఆయన మొదలుపెట్టిన కొన్ని సినిమాలు ఎంతకీ పూర్తి కాక మధ్యలో ఆగిపోయాయి. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్.. మూడు చిత్రాలూ పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. దీని వల్ల ఆ చిత్రాల నిర్మాతలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న మాట కూడా వాస్తవం. ఐతే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొన్ని నెలలకు పవన్ వీలు చేసుకుని ‘హరిహర వీరమల్లు’ను పున:ప్రారంభించారు.
కానీ ఆ సినిమా షూట్ స్టేటస్ ఏంటో.. ముందు అనుకున్నట్లు మార్చి 28న రిలీజవుతుందో లేదో పూర్తి క్లారిటీ లేదు. ఈ విషయమై పవన్కు ఆప్త మిత్రుల్లో ఒకడైన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. పవన్ ఈ సినిమాకు సంబంధించి ఇంకో వారం రోజులు మాత్రమే షూటింగ్లో పాల్గొనాల్సి ఉందని.. త్వరలోనే చిత్రీకరణ పూర్తవుతుందని వెల్లడించారు ఆనంద్ సాయి.
ఇక పవన్ సినిమాలు పెండింగ్లో పడడం, ఆలస్యం కావడం గురించి ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్రాలు కమిటైనపుడు తన పొలిటికల్ కమిట్మెంట్ల గురించి పవన్ నిర్మాతలకు స్పష్టత ఇచ్చినట్లు వెల్లడించారు. అన్నింటికీ సిద్ధపడే పవన్తో సినిమాలు చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారన్నారు. ఐతే ఈ చిత్రాలు మరీ ఆలస్యం కావడం గురించి ఆనంద్ సాయి స్పందిస్తూ.. నిజానికి పవన్ గతంలో కొన్ని డేట్లు ఇచ్చినా కూడా నిర్మాతలు ఉపయోగించుకోలేదని..
చాలా కాల్ షీట్లు వేస్ట్ అయ్యాయని.. నిర్మాతల వైపు నుంచి కూడా తప్పులు ఉన్నాయని ఆనంద్ సాయి తెలిపాడు. ప్రస్తుతం పవన్ 24*7 బిజీగా ఉన్నా సరే.. వీలు చేసుకుని పెండింగ్లో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆనంద్ సాయి తెలిపాడు.