నైజామ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలుపెట్టకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండటంతో వాళ్ళ ఆందోళన సబబే అని చెప్పాలి. దీని వల్ల జిఓ వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయి బుకింగ్స్ ఓపెన్ కాలేదు. కొన్ని చోట్ల మాత్రం ఉదయం 4 నుంచి బెనిఫిట్ షోల అమ్మకాలు మొదలుపెట్టేశారు. రేపటికంతా ఫుల్ లెన్త్ అందుబాటులోకి వచ్చేస్తాయి.
అయితే నైజామ్ లో సంక్రాంతికి రాజా సాబ్ కు జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మైత్రి మేకర్స్ ఈసారి ఆ పొరపాటు చేయకూడదని నిర్ణయించుకున్నారట. అంటే ఒకవేళ తెలంగాణ జిఓ కనక లేట్ అయ్యే పక్షంలో ఎలాంటి అనుమతులు అవసరం లేని ఉదయం ఎనిమిది గంటల షోల నుంచి బుకింగ్స్ పెట్టేలా డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుతున్నారట. రాజా సాబ్ కోసం ఇలాగే చివరి నిమిషం దాకా ఎదురు చూడటం ఎంత చేటు చేసిందో తెలిసిందే.
హైదరాబాద్ విమల్ థియేటర్ దగ్గర అర్ధరాత్రి జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అది రిపీట్ కాకూడదంటే జిఓ పంచాయితీ లేకుండా త్వరగా నిర్ణయం తీసుకోవాలి. నిర్మాతలు తమ వైపు నుంచి మంతనాలు చేస్తున్నారు కానీ ఏ మేరకు కొలిక్కి వస్తాయో వేచి చూడాలి. ఇటీవలే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన 90 రోజుల నిబంధనను సుప్రీమ్ కోర్టు నిలిపివేసిన నేపథ్యంలో ఉస్తాద్ కు ఎలాంటి అడ్డంకులు ఉండవని భావిస్తే దానికి రివర్స్ లో వ్యవహారం తేలడం లేదు.
ఈ కారణంగా ఉస్తాద్ భగత్ సింగ్ బుక్ మై షో యాప్ ట్రెండింగ్ లో తక్కువ నెంబర్లు చూపిస్తోంది. దురంధర్ ది రివెంజ్ తో పోల్చుకుంటే చాలా వెనుకబడి ఉంది. ఓజి రేంజ్ హైప్ ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ మూవీ కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ ఓపెనింగ్స్ కు సంబంధించి ఎవరికి అనుమానాలు లేవు కానీ ఇలాంటి సందిగ్ధాలు లేనిపోని ఇబ్బందులు సృష్టిస్తాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ అయ్యాక హరీష్ శంకర్ టీమ్ నాన్ స్టాప్ గా ప్రమోషన్లు చేస్తూనే ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates