మాములుగా స్టార్ వారసులంటే జనంలో పిచ్చ క్రేజ్ ఉంటుంది. తాము అభిమానించే హీరోల పిల్లలు తెరమీద ఎలా కనిపిస్తారనే ఉత్సహంతో మొదటి రోజే థియేటర్లకు పరుగులు పెడతారు. మన దగ్గర రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్, తారక్ లాంటి వాళ్ళు అలాంటి గ్రాండ్ వెల్కమ్ చూసినవాళ్ళే.
ఆ మద్దతే ఈ స్థాయికి తీసుకొచ్చింది. కానీ బాలీవుడ్ లో రివర్స్ సీన్ కనిపిస్తోంది. ఎల్లుండి లవ్ యాపా రిలీజవుతోంది. మూడేళ్ళ క్రితం వచ్చిన తెలుగు తమిళ సూపర్ హిట్ లవ్ టుడేకి ఇది అఫీషియల్ గా రీమేక్. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. ట్రైలర్ చూస్తే పెద్దగా మార్పులు చేసినట్టు కనిపించలేదు.
లవ్ యాపా ద్వారా ఇద్దరు స్టార్ కిడ్స్ లాంచ్ అవుతున్నారు. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ మొదటిసారి బిగ్ స్క్రీన్ మీద దర్శనమిస్తున్నాడు. దివంగత శ్రీదేవి రెండో కూతురు, జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ వెండితెరపై తెరంగేట్రం చేస్తోంది. వీళ్లిద్దరూ ఓటిటి డెబ్యూ గతంలో చేశారు కానీ వాటికి నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది.
కట్ చేస్తే ఈ లవ్ యాపా మీద ఆడియన్స్ లో ఎలాంటి ఆసక్తి కనిపించడం లేదని అడ్వాన్స్ బుకింగ్స్ తేటతెల్లం చేస్తున్నాయి. రిలీజ్ ఇంకో రెండు రోజుల్లో ఉన్నప్పటికీ టికెట్ అమ్మకాలు ఆశాజనకంగా లేవు. బుక్ మై షో ట్రెండింగ్ కి రావడం అనుమానమే.
విచిత్రమేంటంటే దీంతో పాటే రిలీజవుతున్న బ్యాడ్ ఆస్ రవికుమార్ కు బుకింగ్స్ బాగున్నాయి. ఇప్పటికే నలభై వేల మల్టీప్లెక్స్ టికెట్లు అమ్ముడుపోయాయి. నిజానికిది ట్రోలింగ్ కు గురైన కంటెంట్. ఎప్పుడో 80 కాలం నాటి మసాలా కంటెంట్ తో తీశామని నిర్మాతలు బహిరంగంగా ప్రకటించడంతో సోషల్ మీడియా మీమ్స్ పెద్ద ఎత్తున వచ్చి పడ్డాయి.
అయినా సరే పబ్లిక్ హీరో హిమేష్ రేషమియాని థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పాపం అమీర్ ఖాన్ పనులన్నీ మానుకుని కొడుకు కోసం ప్రమోషన్లు చేసినా లవ్ యాపాకి ఇలాంటి పరిస్థితి రావడం విచిత్రం. ఇక ఖుషి కపూర్ గురించి చెప్పేందుకు ఏం లేదు.