గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. సినిమా ఫ్లాప్ అనే సంగతి పక్కనపెడితే రెండో వారంలోనే 4కె క్వాలిటీతో మరో ప్రింట్ బయటికి రావడం ఊహించని షాక్.
సినిమా ఫ్లాప్ కాబట్టి పరిశ్రమ అంత సీరియస్ గా తీసుకోలేదనే కామెంట్స్ వినిపించాయి కానీ దానికి ముందు పుష్ప 2, ఇటీవలే డాకు మహారాజ్ సైతం వీటి బారిన పడిన విషయం మర్చిపోకూడదు. ఈ పరిణామాల గురించి నిర్మాతలెవరూ స్పందించని తరుణంలో తండేల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవి ఆలోచింపజేసేలా ఉన్నాయి.
ఒకప్పుడు పైరసీ థియేటర్ ప్రింట్లకు పరిమితమై వీడియో క్యాసెట్లు, సిడిల రూపంలో మాత్రమే అందుబాటులో ఉండేది. టెక్నాలజీ పెరిగి ఆన్ లైన్ వచ్చాక రూపం మార్చుకుంది. దీంతో వెబ్ సైట్లలో డౌన్ లోడ్ చేసుకునే ఆప్షన్ రావడం పనిని మరింత సులభతరం చేసింది. అయితే ఓటిటిలు వచ్చి కొత్త సినిమాలను త్వరగా స్ట్రీమింగ్ చేయడం మొదలుపెట్టాక పైరసీ తాకిడి కొంత తగ్గింది.
ఇంతకు ముందు నేరుగా ఫేస్ బుక్ తదితర మాధ్యమాల్లో కొత్త సినిమా లైవ్ పెట్టేవారు. కీలకమైన సీన్ల వీడియోలు అక్కడ ప్రత్యక్షమయ్యేవి. పలు విన్నపాల తర్వాత అల్గారిథంలో చేసిన మార్పులతో వాటిని కట్టడి చేయగలిగారు.
కానీ ఇప్పుడు వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా నేరుగా లింకులు జనాలకు వెళ్లిపోతున్నాయి. వాటికి క్లిక్ చేసి డౌన్లోడ్ కానివ్వడం నిమిషాల్లో పనిగా మారిపోయింది. వీటిని నియంత్రించాలంటే సదరు యాప్స్ యాజమాన్యాలకు ప్రభుత్వం, పరిశ్రమ నుంచి గైడ్ లైన్స్ వెళ్ళాలి. చట్టప్రకారం ఇది తప్పని తెలియజేయాలి.
అలా చేస్తే తప్ప పైరసీ అడ్డుకోవడం అసాధ్యం. దీని వల్ల పూర్తిగా ఇప్పటికిప్పుడు రూపుమాపలేకపోయినా కనీసం కొంత వరకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. బన్నీ వాస్ చెప్పిన మాటల సారాంశం ఇదే. అందరూ ఈ దిశగా ఆలోచించి అన్ని వైపులా చక్రబంధనం బిగిస్తే తప్ప పైరసీ ఆగదు.