ముర‌ళీమోహ‌న్ అంత‌రంగం.. అయితే, అదే పెద్ద స‌మ‌స్య‌!

ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత‌, వ్యాపార వేత్త ముర‌ళీమోహ‌న్‌.. తాజాగా చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్ర‌ముఖులు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు-ప్ర‌భుత్వానికి మ‌ధ్య ఉన్న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. దీనికి సంబంధించి ప్ర‌క‌ట‌న‌లు కూడా చేశారు. అస‌లు గ్యాపే లేద‌ని.. నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు. త‌మ స‌హ‌కారం ఉంటుంద‌ని ప్ర‌భుత్వం త‌ర‌ఫున మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి కూడా తేల్చి చెప్పారు.

దీంతో అస‌లు స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయ్యాయ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ముర‌ళీ మోహ‌న్ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్యలు చేశారు. దీనిని బ‌ట్టి.. అస‌లు స‌మ‌స్య ప‌రిష్కారం కాలేద‌ని స్ప‌ష్ట‌మైంది. మ‌రో 20 రోజుల్లో పెద్ద సినిమాలు విడుద‌ల‌కు రెడీగా ఉన్నాయి. అందుకే ఇంత మంది న‌టులు, నిర్మాత‌లు ద‌ర్శ‌కులు కూడా.. పిల‌వ‌గానే ప్ర‌భుత్వం వ‌ద్ద‌కు ప‌రుగు ప‌రుగున వెళ్లారు. కానీ, అస‌లు స‌మ‌స్య ప‌రిష్కారంపై వారికి ఎలాంటి హామీ ద‌క్క‌లేద‌ని తెలుస్తోంది.

మురళీ మోహ‌న్ ఏమ‌న్నారంటే.. పెద్ద బ‌డ్జెట్ సినిమాల‌కు ప్రీమియ‌ర్ షోలే ప్రాణ‌మ‌ని చెప్పారు. అదేవిధంగా టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునే అవ‌కాశం కూడా ఉండాల‌ని తెలిపారు. ఈ రెండు లేక‌పోతే.. ప్ర‌పంచ స్థాయి సినిమాలు తీయ‌లేమ‌ని.. నిర్మాత‌లు ఎవ‌రూ ముందుకు వ‌చ్చే ప‌రిస్థితి కూడా లేద‌న్నారు. అంటే.. తెలంగాణ సీఎం అసెంబ్లీలో చేసిన ప్ర‌క‌ట‌న‌పై తాజాగా జ‌రిగిన చ‌ర్చ‌లో క్లారిటీ రాలేదు. ఆయ‌న వెన‌క్కి కూడా త‌గ్గ‌లేద‌న్న సంకేతాలు ఇచ్చిన‌ట్టు అయింది.

అంతేకాదు.. కాలంతోపాటు మార్పులు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కూడా ముర‌ళీ మోహ‌న్ చెప్పారు. ప్ర‌స్తుతం టెక్నాల‌జీ పెరిగిపోయింద‌ని.. ఈ నేప‌థ్యంలో సాంకేతిక విలువ‌లు జోడించేందుకు సినిమా నిర్మాణంలో ఎక్కువ‌గా ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంది. అదంతా ఒక వారంలోనే రాబ‌ట్టుకోవాల్సి ఉంటుంద‌ని.. లేక‌పోతే.. సినిమా రంగం పూర్తిగా కుప్ప‌కూలే ప్ర‌మాదం ఉంటుంద‌న్నారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించాల్సి ఉంటుంద‌న్నారు. సో.. ముర‌ళీ మోహ‌న్ వాద‌న‌ను బ‌ట్టి, ఈ విష‌యంలో ఇండ‌స్ట్రీకి స‌రైన హామీ అయితే ల‌భించ‌లేద‌ని తెలుస్తోంది. మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.