వెంకటేష్ ముందు 2 ఆప్షన్లు….ఛాన్స్ ఎవరికో ?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం చేస్తున్న వెంకటేష్ తర్వాత ఎవరితో చేయబోతున్నారనే క్లారిటీ ఇంకా రాలేదు. ప్రస్తుతం ఆయన దగ్గర రెండు ప్రతిపాదనలున్నాయి. మొదటిది సామజవరగమన రచయితల్లో ఒకరైన నందు కొన్ని నెలల క్రితం చెప్పిన కథ బాగా నచ్చింది. అయితే ఫుల్ వెర్షన్ ఇంకా సిద్ధం కాలేదు. దాన్ని సురేష్ బాబు, వెంకీ కలిపి ఓకే చేశాక మరో నిర్మాణ సంస్థ భాగస్వామ్యం తీసుకుని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించాలనేది ఆలోచనట. కానీ కార్యరూపం దాల్చేది లేనిది ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. మరో ప్రపోజల్ డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణకు సానుకూలంగా ఉన్నారట.

స్టోరీ లైన్ నచ్చేసి దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని అంటున్నారు. ఇది కూడా ఫన్ తో కూడిన యాక్షన్ డ్రామాగా చెబుతున్నారు. ప్రొడక్షన్ హౌస్ ఎవరనేది ఖరారు చేయలేదు కానీ వరసగా సినిమాలు తీస్తున్న టాప్ బ్యానరే ఉండొచ్చు. ప్రస్తుతం వెంకటేష్ కేవలం వినోదాత్మక కథలకే ఓటు వేస్తున్నారని సన్నిహితుల మాట. తన వయసుకు ఇప్పుడు నప్పని యాక్షన్ జానర్ ని కొంత కాలం దూరం పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఎఫ్2, ఎఫ్3 సక్సెస్ చూశాక ఎంటర్ టైన్మెంట్ ఉన్నవాటిలోనే తనను చూసేందుకు కుటుంబ ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని అర్థమయ్యింది కాబోలు.

ఇంకొద్ది రోజులు ఆగితే పూర్తి క్లారిటీ వస్తుంది. సంక్రాంతికి వస్తున్నాంతో జనవరి 14 థియేటర్లలో అడుగు పెట్టబోతున్నారు వెంకీ. పొట్టచెక్కలయ్యేలా నవ్వించే హామీతో రావిపూడి దీన్ని ఓ రేంజ్ లో తీర్చిదిద్దారని టాక్. బీమ్స్ సంగీతంలో గోదారి గట్టు మీద రామసిలకయ్యో పాట చార్ట్ బస్టర్ అయిపోయి అంచనాలు పెంచింది. పండగ బరిలో రామ్ చరణ్, బాలకృష్ణలతో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ వెంకీ, అనిల్ ఇద్దరూ కంటెంట్ మీద బోలెడు నమ్మకంతో ఉన్నారు. చివర్లో వచ్చినా సరే గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. ఎక్స్ లవర్ గా మీనాక్షి చౌదరి, భార్యగా ఐశ్యర్య రాజేష్ వెంకటేష్ సరసన హీరోయిన్లుగా నటించారు.