డేట్ ఇచ్చేశాడు.. ఏం కాన్ఫిడెన్సో

కరోనా-లాక్ డౌన్ కారణంగా భారతీయ సినీ రంగంలో ఎంతటి అనిశ్చితి నెలకొందో తెలిసిందే. ఏడు నెలల తర్వాత థియేటర్లు తెరుచుకోబోతున్నప్పటికీ.. సినీ రంగంలో అంతగా ఉత్సాహం కనిపించడం లేదు. ఎందుకంటే 50 శాతం ఆక్యుపెన్సీతో, కరోనా నియంత్రణకు సంబంధించిన షరతుల్ని పాటిస్తూ సినిమాలు ప్రదర్శించి ఏం బావుకుంటామన్న నైరాశ్యం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల్లో వ్యక్తమవుతోంది. అందుకే థియేటర్లు తెరుచుకుంటే తమ సినిమాలు రిలీజ్ చేద్దామని చూస్తున్న చాలామంది.. స్పందనే లేకుండా సైలెంటుగా ఉన్నారు.

ఒకట్రెండు నెలలు ట్రయల్ పీరియడ్ లాగా చూసి ఆ తర్వాత ఏమైనా రెస్పాండవుతారేమో చూడాలి. థియేటర్లు తెరుచుకోబోతున్నట్లు ప్రకటించాక ఇప్పటి వరకైతే ఏ పేరున్న సినిమా థియేట్రికల్ రిలీజ్ గురించి కూడా ప్రకటన రాలేదు. లాక్ డౌన్ మొదలవడానికి ముందే ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న సినిమాలు సైతం మౌనం వహిస్తున్నాయి.

ఇలాంటి తరుణంలో అక్షయ్ కుమార్ తన కొత్త చిత్రం టీజర్‌తో పలకరిస్తూ.. దాని రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశాడు. ఆ చిత్రం ‘బెల్‌బాటమ్’ కాగా.. దీన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 2న విడుదల చేయబోతున్నట్లు టీజర్లో పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి దేశంలోని మెజారిటీ జనాలకు అది పడితే తప్ప ఒకప్పట్లా భారీ చిత్రాలు విడుదలై దండిగా కలెక్షన్లు రాబట్టే పరిస్థితి ఉండదేమో అన్న అనుమానాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం చూస్తే మార్చికి వ్యాక్సిన్ వస్తుంది, జులైకి 25 కోట్ల మందికి వ్యాక్సిన్ వేస్తాం అంటోంది. అది కూడా ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందో తెలియదు.

ఈ నేపథ్యంలో ప్రేక్షకులు స్వేచ్ఛగా థియేటర్లకు రావడం, అవి ఒకప్పటిలా నడవడం ఎప్పటికి జరుగుతుందో స్పష్టత లేదు. అయినా సరే.. ‘బెల్‌బాటమ్’ను వేసవి విడుదల అని కూడా కాకుండా ఏప్రిల్ 2న రిలీజ్ అంటూ ధీమాగా ప్రకటించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆ సంగతలా ఉంచితే.. 80వ దశకానికి, వర్తమానానికి లింకు పెడుతూ ఒక నేవీ అధికారి జీవితాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు ‘బెల్‌బాటమ్’లో. టీజర్ అంతటా అక్షయ్ కుమారే కనిపించాడు. అతడి రెండు లుక్స్‌ కూడా వావ్ అనిపించాయి. ఇంతకుముందు ‘లక్నో సెంట్రల్’ సినిమాను రూపొందించిన రంజిత్ తివారి ఈ చిత్రానికి దర్శకుడు.