‘నిశ్శబ్దం’కు సీక్వెల్ కూడా అట

ఒక కొత్త సినిమా రిలీజ్ కాబోతుండగా.. దాని గురించి కబుర్లు చాలానే చెబుతారు ఆ చిత్రానికి సంబంధించిన వ్యక్తులు. తాజాగా అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైన ‘నిశ్శబ్దం’ గురించి చిత్ర బృందం ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. వాళ్లు చెప్పడం కాదు కానీ.. అనుష్క, మాధవన్‌లతో పాటు హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్సన్ ఇందులో ముఖ్య పాత్ర పోషించడానికి ముందుకొచ్చాడంటేనే ఇది చాలా స్పెషల్ మూవీ అయ్యుంటుందని అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.

దీనికి తోడు రిలీజ్ ముంగిట దర్శకుడు హేమంత్ మధుకర్ తన చిత్రం గురించి ఓ రేంజిలో చెప్పుకున్నాడు. తీరా చూస్తే సినిమాలో అంత విషయం లేదని తేలిపోయింది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని కూడా అనుకున్నాడట హేమంత్.

ప్రతి దర్శకుడికీ తన సినిమా గొప్పగానే అనిపిస్తుంది. అందులోనూ పేరున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు నమ్మి తన సినిమా చేసినపుడు ఆ నమ్మకం ఇంకా పెరుగుతుంది. అందులోనూ ఇంతకుముందు హేమంత్ తీసిన రెండు సినిమాలూ ఏమాత్రం మంచి ఫలితాన్నివ్వలేదు. అయినా సరే.. ఇంతమంది నమ్మి అతడితో సినిమా చేశారు. నిర్మాతలు మంచి బడ్జెట్ పెట్టి మొత్తం అమెరికాలో చిత్రీకరణ చేయించారు.

ఈ నేపథ్యంలో తన సినిమా మంచి ఫలితాన్ని అందుకుంటుందని గట్టిగా నమ్మినట్లున్నాడు హేమంత్. అందుకే ఈ కథకు కొనసాగింపుగా సీక్వెల్ తీసేందుకు కూడా లైన్ రెడీ చేసుకుని ఆ దిశగా సన్నాహాలు చేసుకున్నట్లు సమాచారం. కానీ ఈ సినిమాకు పూర్తి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.

మామూలుగా చూస్తే ఓ మోస్తరుగా అనిపించేదేమో కానీ.. దీని కాస్టింగ్, బడ్జెట్, ప్రోమోలు, చిత్ర బృందం చెప్పిన మాటలు.. ఇవన్నీ చూసి ప్రేక్షకులు అంచనాలు భారీగానే పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగా సినిమా లేకపోవడంతో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ఈ ఫీడ్ బ్యాక్ చూశాక ‘నిశ్శబ్దం’కు సీక్వెల్ తీయడానికి ఇప్పుడున్న నిర్మాతలు కానీ, వేరే వాళ్లు కానీ ముందుకొస్తారా అన్నది సందేహమే.