విరూపాక్ష మ్యాజిక్.. మరోసారి

సాయిధరమ్ తేజ్ కెరీర్లో బిగ్టెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం.. విరూపాక్ష. హార్రర్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రం మాంచి వసూళ్లు రాబట్టింది. గత ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు తేజు మళ్లీ ఓ భారీ చిత్రంలో నటిస్తున్నాడు.

రోహిత్ కేపీ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న సినిమా ఇది. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో రూపొందిస్తుండడం విశేషం. ఈ మూవీ బడ్జెట్ వంద కోట్లకు పైమాటే అంటున్నారు.

ఈ ఏడాది ‘హనుమాన్’తో భారీ విజయాన్నందుకున్న ‘ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్’ బేనర్ మీద నిరంజన్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి టెక్నీషియన్లు కూడా పేరున్న వాళ్లనే తీసుకుంటున్నారు. కంగువ సహా పలు భారీ చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన సినిమాటోగ్రాఫర్ వెట్రి పళనిస్వామి ఈ చిత్రానికి పని చేస్తున్నాడు.

తాజాగా ఈ మూవీకి సంగీత దర్శకుడు కూడా ఖరారయ్యాడు. కన్నడలో ఇప్పుడు అత్యంత డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్‌ను తేజు సినిమా కోసం తీసుకున్నారు.

‘విరూపాక్ష’కు కూడా అజనీషే సంగీత దర్శకుడు అందులో మంచి పాటలు, అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ అందించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు అజనీష్. దీని కంటే ముందు అతను ‘మంగళవారం’ సినిమాకు కూడా మ్యూజిక్ చేశాడు. ఈ సినిమా నేపథ్య సంగీతానికి కూడా ప్రశంసలు దక్కాయి. మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకు తన మ్యూజిక్ బాగా సెట్ అవుతుంది.

తేజు ప్రస్తుతం చేస్తున్నది చారిత్రక నేపథ్యం ఉన్న థ్రిల్లర్ మూవీ. అజనీష్ మరోసారి తేజు సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇస్తాడని ఆశించవచ్చు. ఇందులో తేజు నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపించనున్నాడు. వచ్చే ఏఢాది వేసవిలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.