ఫొటో చూసి ప్రియాంక మోహన్‌ నిశ్చితార్థం చేసేశారు

తెలుగు, తమిళం, మలయాళం.. మూడు భాషల్లోనూ సినిమాలు చేస్తూ మంచి ఊపు మీదుంది ప్రియాంక మోహన్. తెలుగులో నాని సరసన నటించిన ‘సరిపోదా శనివారం’ మంచి హిట్టయింది. ఇక దీపావళికి తన నుంచి ‘బ్రదర్’ అనే తమిళ సినిమా రాబోతోంది. ఇంకా ఆమె చేతిలో అరడజను సినిమాల దాకా ఉన్నాయి.

కెరీర్ ఇంత ఊపులో ఉండగా ప్రియాంక నిశ్చితార్థం చేసుకుంటుందని ఎవరైనా అనుకుంటారా? కానీ సోషల్ మీడియాలో ఈ రకంగా గట్టి ప్రచారం జరుగుతోంది. ఇందుక్కారణం ‘బ్రదర్’ సినిమా టీం సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఒక పోస్టరే. అందులో జయం రవి, ప్రియాంక మోహన్ పూల దండలతో పెళ్లి జంటలా కనిపిస్తున్నారు. సినిమాలో భాగంగా ఇలా కనిపించిందీ జంట.

కానీ సోషల్ మీడియా జనం మాత్రం ఈ పోస్టర్ చూసి ప్రియాంకకు, జయం రవికి నిశ్చితార్థం జరిగిందని అర్థం చేసుకున్నారు. ఎవరో ఈ మేరకు పుకారు పుట్టించారు. జయం రవి తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రియాంకతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని అర్థం చేసుకున్నారు. వీరిది సైలెంట్ లవ్ స్టోరీ అని ప్రచారం జరిగిపోయింది. ఈ విషయం తెలిసి పలువురు నేరుగా ప్రియాంకకు ఫోన్ చేసి విషెస్ చెప్పారట. దీంతో ప్రియాంక దీనిపై క్లారిటీ ఇచ్చింది.

‘బ్రదర్’ సినిమా టీం ఇలాంటి ఫోటో రిలీజ్ చేసి తప్పు చేసిందని.. సినిమాలో భాగమైన దాన్ని నిజంగా జనం అనుకుంటున్నారని.. తెలుగు ఇండస్ట్రీ నుంచి కొందరు తనకు ఫోన్ చేసి విష్ చేశారని ఆమె చెప్పింది. ఏదైనా ఫొటో బయటికి వస్తే దాని వెనుక స్టోరీ ఏంటో తెలుసుకోకుండా జనం ఇలా ఎలా ఊహించుకుంటారని ఆమె ప్రశ్నించింది. ‘బ్రదర్’ దీపావళి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.