నందమూరి నాలుగో తరం హీరో దర్శనం ఆ రోజే

టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినిమా ఫ్యామిలీస్‌లో నందమూరి వారిది ఒకటి. ఎన్టీఆర్ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆ కుటుంబం నుంచి చాలామందే సినీ రంగంలోకి వచ్చారు. ఎన్టీఆర్ తర్వాత రెండు తరాల నుంచి హీరోలు టాలీవుడ్లో తమ ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు నాలుగో తరం ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. దివంగత హరికృష్ణ మనవడు, దివంగత జానకి రామ్ తనయుడు అయిన నందమూరి తారక రామారావు (తన షార్ట్ నేమ్ కూడా ఎన్టీఆర్‌యే)ను సీనియర్ దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి హీరోగా పరిచయం చేయబోతున్నట్లు ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఐతే సినిమాను ప్రకటించినపుడు హీరోను మీడియా ముందుకు తీసుకురాలేదు. తన ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేయలేదు. ఇప్పుడు అందుకోసం ప్రత్యేకంగా ముహూర్తం నిర్ణయించారు.

దీపావళి ముంగిట అక్టోబరు 30న తన హీరో ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేయబోతున్నాడు వైవీఎస్ చౌదరి. నందమూరి నాలుగో తరం వారసుడి దర్శనం ఒక రేంజిలో ఉంటుందని ఆయన ఊరిస్తున్నారు. ఐతే కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే లాంచ్ చేస్తాడా.. లేక మీడియా ముందుకు తీసుకొచ్చి హీరోను పరిచయం చేస్తాడా అన్నది చూడాలి.

చివరగా ‘రేయ్’ మూవీతో దారుణమైన ఫలితాన్ని అందుకున్న చౌదరి.. దాదాపు దశాబ్దం పాటు విరామం తీసుకున్నారు. ఈ కాలంలో ఆయన వారం వారం కొత్త సినిమాలు చూస్తూ.. మారిన సినిమా పోకడలను గమనిస్తూ వచ్చారు. ఇక ఆయన మళ్లీ సినిమా తీయడేమో అనుకున్న సమయంలో తానెంతో అభిమానించే నందమూరి తారక రామారావు ముని మనవడిని హీరోగా పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి కీరవాణి, చంద్రబోస్, సాయిమాధవ్ బుర్రా లాంటి పేరున్న టెక్నషియన్లు పని చేస్తున్నారు. ఎప్పట్లాగే ఈ సినిమాను కూడా చౌదరి సొంత బేనర్లోనే తీస్తున్నారు.